జీఎస్‌టీ నీడన తగ్గనున్న పసిడికాంతి!

7 Jul, 2017 01:03 IST|Sakshi
జీఎస్‌టీ నీడన తగ్గనున్న పసిడికాంతి!

రానున్న కొద్దికాలంపై డబ్ల్యూజీసీ నివేదిక
ఈ ఏడాది డిమాండ్‌ 750 టన్నులు
ఐదేళ్ల సగటు 846 టన్నులకన్నా తక్కువ!  


న్యూఢిల్లీ: భారత్‌లో ఈ నెలారంభం నుంచీ అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)వల్ల స్వల్పకాలంలో బంగారానికి డిమాండ్‌ తగ్గుతుందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో తెలిపింది. 1.5 శాతంగా ఉన్న పసిడిపై రేటు జీఎస్‌టీ అనంతరం 3 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూజీసీ తాజా నివేదికను చూస్తే...

దీర్ఘకాలంలో మాత్రం పుత్తడి పరిశ్రమపై జీఎస్‌టీ సానుకూల ప్రభావం చూపే వీలుంది. పారదర్శకత పెరగడం, సరఫరా సమస్యలు తొలగిపోవడం వంటి అంశాలు ఇందుకు దోహదపడేవిగా  అంచనావేసింది.  
అయితే స్వల్పకాలానికి చూస్తే– ఇప్పటికే ఏడు వారాల కనిష్ట స్థాయిలో ట్రేడవుతున్న పసిడి ధరలపై జీఎస్‌టీ మరింత ఒత్తిడిని పెంచే వీలుంది.
జీఎస్‌టీతో చిన్న  వృత్తి నిపుణులు, రిటైలర్లపై వివిధ స్థాయిల్లో పన్ను భారం పడే వీలుంది.
రెండు లక్షల రూపాయలపైన నగదు లావాదేవీలపై ప్రభుత్వ ఆంక్షలు గ్రామీణ ప్రాంతాల్లో పసిడి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ అంశాలు డిమాండ్‌ను తగ్గించడంతోపాటు బ్లాక్‌మార్కెటింగ్‌కు దారితీయవచ్చు.
ప్రపంచంలో పసిడి కొనుగోళ్ల విషయంలో రెండవ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌లో ఈ ఏడాది పసిడి డిమాండ్‌ 650 నుంచి 750 టన్నుల శ్రేణిలో ఉండే వీలుంది. ఇది గడచిన ఐదు సంవత్సరాల్లో సగటు 846 టన్నుల కన్నా తక్కువ.
ఆసియా టైగర్లుగా పిలవబడే నాలుగు దేశాలు– హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్‌లు 1980–1990 మధ్య భారీ వృద్ధిని సాధించాయి. ఇందుకు ప్రధాన కారణాల్లో ఆ దేశాల యువత ఒక పటిష్ట కార్మిక శక్తిగా అవతరించడం ఒకటి. ప్రస్తుతం భారత్‌ వృద్ధికి ఇదే అంశం ప్రధాన మద్దతుగా నిలుస్తున్న అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు