జీఎస్‌టీ వసూళ్లు గాడిలోకి...

2 Jul, 2020 13:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్‌టీ వసూళ్లు గాడిన పడుతున్నాయి. వరుసగా రెండు నెలల లాక్‌డౌన్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో వసూళ్లు గణనీయంగా పడిపోగా.. జూన్‌లో తిరిగి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభం కావడంతో రూ.90,917 కోట్ల ఆదాయం జీఎస్‌టీ రూపంలో వచ్చింది. ఏప్రిల్‌లో నమోదైన రూ.32,294 కోట్లు, మే నెలలో వచ్చిన రూ.62,009 కోట్లతో పోలిస్తే గణనీయంగా పుంజుకున్నట్టే తెలుస్తోంది. కానీ, గతేడాది జూన్‌ నెలలో వచ్చిన ఆదాయంతో పోల్చి చూసుకుంటే ఈ ఏడాది జూన్‌ నెలలో ఆదాయం 9 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఇక 2020–21 తొలి త్రైమాసిక కాలంలో (ఏప్రిల్‌–జూన్‌ వరకు) వసూళ్లు గతేడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలిస్తే 59 శాతం తగ్గాయి. తొలి త్రైమాసికంలో ప్రధానంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడం తెలిసిందే.  (హైవే ప్రాజెక్టుల్లోకి చైనాకు నో వే!)

ఏపీ, తెలంగాణలో పెరిగిన ఆదాయం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, బిహార్, అసోమ్‌ వంటి రాష్ట్రాల్లో జీఎస్‌టీ ఆదాయం గతేడాది ఇదే కాలంతో పోల్చి చూసుకుంటే జూన్‌ నెలలో పెరిగినట్టు  ఆర్థిక శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో 6% వృద్ధి నమోదై రూ.2,367 కోట్లు వసూలయ్యాయి. తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఈ జూన్‌లో 3 శాతం వృద్ధితో రూ. 3,276 కోట్ల జీఎస్‌టీ వసూలైంది.  ‘‘ప్రభుత్వం రూ.90,917 కోట్ల స్థూల జీఎస్‌టీ ఆదాయాన్ని 2020 జూన్‌ నెలలో వసూలు చేసింది. 2019 జూన్‌ నెలలో వసూళ్లలో ఇది 91%’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్వీట్‌ చేశారు. జూన్‌లో వచ్చిన రూ.90,917 కోట్లలో సెంట్రల్‌ జీఎస్‌టీ రూపంలో రూ.18,980 కోట్లు, స్టేట్‌ జీఎస్‌టీ రూపంలో రూ.23,970 కోట్లు, ఇంటెగ్రేటెడ్‌ జీఎస్‌టీ  రూ.40,302 కోట్లు వచ్చింది. సెస్సు రూపంలో రూ.7,665 కోట్లు వసూలైంది. 
 

మరిన్ని వార్తలు