ఏటీఎం, బ్యాంకింగ్‌ సేవలపై బాదుడు షురూ

3 Jul, 2017 14:12 IST|Sakshi
ఏటీఎం, బ్యాంకింగ్‌ సేవలపై బాదుడు షురూ

న్యూఢిల్లీ:  జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ పన్నుల  ప్రభావం  ఏటీఏం,  బ్యాంకింగ్‌ సేవలపై భారీగా  పడనుంది.  కేవలం వివిధ వ్యాపార పరిశ్రమలపైనే  కాకుండా  ఆర్థిక లావాదేవీలపై కూడా ప్రభావితం చేయనుంది.  ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్లను (ఎటిఎంలు)  ఏర్పాటు చేయడం ఇక  ఖరీదైన వ్యవహారంగా మారనుంది.  ముఖ్యంగా  జీఎస్‌టీ పన్ను పరిధిలో ఏటీఎం  కేంద్రాలపై పన్ను రేటు గరిష్టంగా 28శాతం నిర్ణయించడంతో ఈ సేవలు ఇకపై ప్రియం కానున్నాయి.  దీంతో చిన్నబ్యాంకులు, కొత్తగా ఏర్పాటైన పేమెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థలపై భారీగా  పడనుంది.

ముఖ్యంగా ఆర్థిక సేవలపై విధించిన పన్ను పోటుతో  వినియోగదారులపై మరింత భారం పెరిగింది. ఆర్థిక సేవల్లో భాగంగా ఏటీఎం లావాదేవీలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, బీమా ప్రీమియం, నెలవారి చెల్లింపులు(ఈఎంఐ)లు మరింత భారం కానున్నాయి.  ఏటీఎం ఉపసంహరణలు, నగదు డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్లు , చెక్‌ బుక్‌ జారీ సహా ఇతర బ్యాంకింగ్ సేవలు కొత్త పన్ను పాలన కింద రానున్నాయి.  దీని ప్రకారం బ్యాంకింగ్ లావాదేవీలపై  15 శాతానికి బదులుగా 18 శాతం  సర్వీస్‌ టాక్స్‌  వసూలు  చేస్తారు.  ఈ  పన్నుల స్లాబ్లలో మార్పుల ప్రకారం  నిర్ణీత లావాదేవీలు ముగిసిన తరువాత రూ.100ల ప్రతి బ్యాంకింగ్ లావాదేవికి, ప్రతి కస్టమర్ రూ.3 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.  ప్రస్తుతం నగదు డిపాజిట్,  ఏటీఏం లావాదేవీలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, బీమా ప్రీమియంలు, ఈఎంఏ చెల్లింపులపై 15 శాతం సేవా పన్నును  వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.

జీఎస్‌టీ లాంచింగ్‌కుముందు కౌన్సిల్‌ తో టాప్‌ బ్యాంక్‌ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐ చైర్‌ పర్సన్‌ అరుధంతి భట్టాచార్య మాట్లాడుతూ  సర్వీస్‌ టాక్స్‌ తో కలిపి జీఎస్‌టీ  వసూలు చేయాలని చెప్పారు. తత్ఫలితంగా  ప్రస్తుత సర్వీసు రేటు 15 శాతం  18 శాతానికి చేరుతుందని వెల్లడించారు. ఈ మేరకు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, స్టాండర్డ్ చార్టర్డ్  సహా వివిధ బ్యాంకులు చార్జీల విధింపుపై  వారి కస్టమర్లకు ఎస్‌ఎంఎస్‌ సమాచారాన్ని కూడా అందిస్తుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు