జీఎస్టీ రేట్ల కోత : ఈ-కామర్స్‌ దిగ్గజాలకు ఝలక్‌

23 Jul, 2018 15:27 IST|Sakshi
ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ కంపెనీలు

న్యూఢిల్లీ : పలు ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గించి శనివారం జీఎస్టీ కౌన్సిల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ రేట్ల కోత చేపట్టిన జీఎస్టీ కౌన్సిల్‌ ప్రముఖ ఈ-కామర్స్‌ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, మింత్రా లాంటి కంపెనీలకు ఝలకిచ్చింది. ఉత్పత్తులపై తగ్గించిన పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు జీఎస్టీ అథారిటీలు ఆడిట్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎకానమిక్‌ టైమ్స్‌ రిపోర్టు ప్రకారం, ప్రముఖ ఈ-కామర్స్‌ కంపెనీలపై ఆడిట్‌ చేపట్టాలని నేషనల్‌ యాంటీ-ప్రాఫిటరింగ్‌ అథారిటీ, డైరెక్టర్‌ జనరల్‌ను ఆదేశించింది. 

గతేడాది నవంబర్‌లోనే జీఎస్టీ కౌన్సిల్‌, 178 ఉత్పత్తులపై పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అదే నెలలో ప్రభుత్వం నేషనల్‌ యాంటీ-ప్రాఫిటరింగ్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. జీఎస్‌టీలో త‌గ్గిన‌ ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు కేంద్రం దీన్ని ఏర్పాటు చేసింది. వినియోగదారుల నుంచి పన్ను రేట్లకు విరుద్ధంగా వ్యాపారులు వసూలు చేసినా.. పన్ను తగ్గిన తర్వాత ధరలు తగ్గించకపోయినా ఈ సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదుల్లో మెరిట్‌ ఉంటే, వాటిని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సేఫ్‌గార్డ్స్‌కు తదుపరి విచారణకు పంపిస్తోంది. డైరెక్టర్‌ జనరల్‌ సేఫ్‌గార్డ్స్‌ మూడు నెలలో విచారణను పూర్తి చేస్తుంది. ఆ తర్వాత యాంటీ-ఫ్రాపిటరింగ్‌ అథారిటీకి రిపోర్టును పంపిస్తుంది. 

ఒకవేళ కంపెనీ జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందజేయడం లేదని అథారిటీ గుర్తించి.. లబ్దిదారుడు ఎవరో తెలియని పక్షంలో, ఈ మొత్తాన్ని కన్జ్యూమర్‌ వెల్‌ఫేర్‌ ఫండ్‌కు బదిలీ చేయాలని ఆదేశిస్తుంది. తక్కువ పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకపోతే, సంస్థ లేదా వ్యాపార రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం కూడా అథారిటీకి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు స్టాండింగ్‌ కమిటీ ముందుకు మొత్తం 354 ఫిర్యాదులు వచ్చాయి. తమకు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను లేదా పన్ను కోత ప్రయోజనాలను అందజేయడం లేదని వినియోగదారులు ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు