న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో(ఎంఎస్ఎంఈ) పోటీతత్వాన్ని వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పెంచుతుందని అసోచామ్ నివేదిక తెలిపింది. ఇన్పుట్ క్రెడిట్, సులభతర పన్ను విధానం, రవాణా పరంగా వ్యయాల మిగులు, అవ్యవస్థీకృత రంగం నుంచి వ్యాపారం వ్యవస్థీకృత రంగానికి మళ్లడం ద్వారా అవకాశాల పెరుగుదల వంటి ప్రయోజనాలు చేకూరతాయని పేర్కొంది.
అసోచామ్, ఆశ్విన్ పరేఖ్ అడ్వైజరీ సర్వీసెస్ ఈ మేరకు ఉమ్మడిగా ఓ అధ్యయనం నిర్వహించగా, అందుకు సంబంధించిన నివేదికను విడుదల చేశాయి. జీఎస్టీ వల్ల మార్కెట్ అవకాశాలు పెరుగుతాయని, రవాణా పరంగా అడ్డంకులు తొలగిపోవడం వల్ల ఎంఎస్ఎంఈ రంగానికి లాభం కలుగుతుందని ఈ నివేదిక తెలిపింది. నిబంధనల అమలు పరంగా వ్యయాలను తగ్గిస్తుందని పేర్కొంది. దీంతో దేశీయ ఎంఎస్ఎంఈ రంగం తక్కువ వ్యయాలతో అంతర్జాతీయంగా చైనా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు పోటీనివ్వగలదని అంచనా వేసింది.