రూ.501 కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎమ్సీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 25 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.165 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.205 కోట్లకు పెరిగిందని హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ తెలిపింది.
మొత్తం ఆదాయం రూ.417 కోట్ల నుంచి రూ.501 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.12 శాతం పెరిగి రూ.207 కోట్లకు చేరాయని వివరించింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి నిర్వహణ ఆస్తులు 22 శాతం వృద్ధితో రూ.3.01 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. నిర్వహణ ఆస్తుల పరంగా భారత్లో రెండో అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇదే. మొదటి స్థానంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నిలిచింది.
ఈ నెలలోనే లిస్టైన హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ..
హెచ్డీఎఫ్సీ గ్రూప్కు చెందిన ఈ కంపెనీ ఈ నెల మొదట్లోనే స్టాక్ మార్కెట్లో లిస్టయింది. రూ.1,100 ఇష్యూ ధరతో వచ్చిన ఈ ఐపీఓకు మంచి స్పందన లభించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ షేర్ 0.7 శాతం లాభంతో రూ.1,761 వద్ద ముగిసింది.