క్యూ4లో అదరగొట్టిన హెచ్‌డీఎఫ్‌సీ

18 Apr, 2020 16:45 IST|Sakshi

సాక్షి, ముంబై :  2020 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం  హెచ్‌డీఎఫ్‌సీ అదరగొట్టింది. శనివారం విడుదల చేసిన  త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం  17.7 శాతం  పుంజుకుని 6,928 కోట్ల రూపాయలకు  చేరింది. అంతకుముందు ఏడాది కాలంలో ఇది 5,885 కోట్ల రూపాయలు. ఏకీకృత మొత్తం ఆదాయం, 38,287 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 33,260 కోట్లగా వుంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 16.2 శాతం పెరిగి రూ .15,204 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) రూ .12,650 కోట్లకు, నికర ఎన్‌పిఎలు 3,542 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.  అయితే కరోనా వైరస్ సంక్షోభంతో  ప్రొవిజన్లు గత ఏడాదితో  పోలిస్తే  (1,889 కోట్లు)  రూ. 3,784.5 కోట్లకు పెరిగాయి. మునుపటి త్రైమాసికంలో రూ. 3,043.6 కోట్లు. (హెచ్‌డీఎఫ్‌సీలో చైనా బ్యాంక్ వాటాలు పెంపు)

కోవిడ్-19వల్ల ఏర్పడిన అనిశ్చితి వాతావరణంలో  డివిడెండ్ చెల్లింపులపై శుక్రవారం ప్రకటించిన ఆర్‌బీఐ ఆదేశాల మేరకు 2019-20కి సంబంధించి డివిడెండ్ చెల్లింపులు చేయబోమని బ్యాంక్ తెలిపింది. లిక్విడిటీ ప్రొఫైల్‌తో పాటు  బలమైన వ్యాపారాన్ని కలిగి వున్న నేపథ్యంలో ఎస్ అండ్ పి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌  స్థిరమైన రేటింగ్‌ను  ప్రకటించింది.  సగటు ఆదాయానికి మించి బలమైన ఆదాయాలు, సాధారణ మూలధన సేకరణ, మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్,  పోర్ట్‌ఫోలియో వైవిధ్యం, మంచి ఎసెట్ క్వాలిటీ మద్దతుతో బ్యాంకు  క్యాపిటలైజేషన్ భారతీయ బ్యాంకింగ్ రంగం సగటు కంటే గణనీయంగా బలంగా ఉందనీ, భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యుత్తమంగా ఉందని హెచ్‌డీఎఫ్‌సీ  ఎస్ అండ్ పి వ్యాఖ్యానించింది. 

మరిన్ని వార్తలు