గరిష్టం 5శాతం పతనమైన హెచ్‌డీఎఫ్‌సీ షేరు

26 May, 2020 12:43 IST|Sakshi

ఇన్వెస్టర్లకు మెప్పించని క్యూ4 ఫలితాలు

‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించిన బ్రోకరేజ్‌లు

హౌసింగ్‌ ఫైనాన్స్‌ హెచ్‌డీఎఫ్‌సీ షేరు మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా ఇంట్రాడే గరిష్టం నుంచి 5శాతం నష్టాన్ని చవిచూసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ. 1523.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం మార్కెట్‌ లాభాల ప్రారంభంలోనే భాగంగా 3.50శాతం లాభపడి రూ.1568.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 


క్రితం రోజు కంపెనీ విడుదల చేసిన ఫలితాలు పట్ల ఇన్వెస్టర్లు నిరుత్సాహ పరచడంతో వారు షేరు అమ్మకాలకు మొగ్గు చూపారు.  ఇంట్రాడే గరిష్టం స్థాయి(రూ.1568.00) నుంచి ఏకంగా 5.20శాతం నష్టపోయి రూ.1486.45 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు షేరు మునుపటి ముగింపు(రూ.1516.55)తో పోలిస్తే 2శాతం నష్టంతో రూ.1485 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్టం గరిష్ట ధరలు వరుసగా రూ.1473.10, రూ.2499.65 ఉన్నాయి. ఈ 2020 ఏడాదిలో షేరు 37శాతం నష్టాన్ని చవిచూసింది.  

హెచ్‌డీఎఫ్‌సీ నిన్న క్యూ4 ఫలితాలను ప్రకటించింది. క్యూ4లో నికర లాభం రూ.2,862 కోట్ల నుంచి 22 శాతం క్షీణించి రూ.2,233 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.3,161 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.3,780 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 3.3 శాతం నుంచి 3.4 శాతానికి పెరిగింది. డివిడెండ్‌ ఆదాయం రూ.537 కోట్ల నుంచి రూ.2 కోట్లకు, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై లాభాలు రూ.321 కోట్ల నుంచి రూ.2 కోట్లకు తగ్గాయి.  అసెట్‌ క్యాలిటీ క్షీణించడంతో చాలా మందిని నిరాశపరిచింది.

అయినప్పటికీ పలు బ్రోకరేజ్‌ సంస్థలు షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి అలాగే టార్గెట్‌ ధరను రూ.1900ను రూ.2200కు పెంచాయి. 

ఫిలిప్‌ క్యాపిటల్‌ బ్రోకరేజ్‌ సంస్థ:
హౌసింగ్‌ ఫైనాన్స్‌ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ ఎంతటి బలమైన స్థానాన్ని ఆక్రమించిందో అందరి తెలుసు. కఠినమైన పూచీకత్తు పద్ధతులు, బఫర్ నిబంధనలు రుణ నష్టాల్ని నివారించగలిగాయి. వ్యాపార సంబంధిత రిస్క్‌లు ఉన్న కారణంగా గతకొన్ని నెలలుగా షేరులో డీ-రేటింగ్ ఉంది.

షేర్‌ఖాన్‌ బ్రోకరేజ్‌: 
బలమైన బ్యాలెన్స్‌ షీట్‌, ఆదాయాల స్థిరత్వం, నాణ్యత హెచ్‌డీఎఫ్‌సీకి కీలకమైన పర్యవసనాలు కొనసాగుతున్నాయి. ఈ అంతరం మధ్యస్థ-కాల సవాళ్లను అధిగమించడానికి సహాయపడుతుంది. మిగులు ద్రవ్యత సుమారు రూ. 30,000 కోట్లుగా ఉంది. ఇది మార్జిన్లను క్షీణింపజేసే అవకాశం ఉంది. షేరు టార్గెట్‌ ధరను రూ.2,113గా నిర్ణయించడమైంది. 

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌:
ప్రస్తుత కాలంలో షేరు తనఖా అనే సురక్షిత పెట్టుబడి సాధనంగా మారింది. తక్కువ రుణభారం హెచ్‌డీఎఫ్‌సీకు కలిసొచ్చే అంశం. అయితే రానున్న రోజుల్లో హోల్‌సేల్‌(బిల్డర్‌) విభాగం నుంచి నుంచి డిఫాల్ట్‌లు అయ్యే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. 

మోర్గాన్‌స్టాన్లీ  షేరు టార్గెట్‌ ధర రూ.2115గానూ, కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రూ.2150, రూ.1905గా నిర్ణయించాయి.

మరిన్ని వార్తలు