రూ.350 కోట్లు మోసపోయాం... కాపాడండి!

5 Oct, 2019 12:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ముంబై: రియల్‌ ఎస్టేట్‌ సంస్థల అక్రమాలకు గృహకొనుగోలుదారులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీకావు. తాజాగా ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ, పీఎంసీ బ్యాంకు స్కాంకు ప్రధాన కారణమై హెచ్‌డీఐల్‌ వినియోగదారులు రోడ్డెకారు. 350 కోట్ల రూపాయల మేర ఇరుక్కుపోయాం కాపాడమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కొంతమంది గృహ కొనుగోలుదారులు లేఖ రాశారు. తొమ్మిదేళ్లుగా ఈ ప్రాజక్టులో చిక్కుకున్నామని వాపోయారు.

సబర్బన్ ములుండ్ ప్రాజెక్టులోని 450 మంది హెచ్‌డిఐఎల్  బాధితులు ఈ లేఖ రాశారు. దివాలా తీసిన హెచ్‌డీఐఎల్‌ రియల్టర్‌కు మొత్తం 350 కోట్ల రూపాయలు చెల్లించామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని  తమను ఈ కష్టాలనుంచి  గట్టెక్కించాలని,  విస్పరింగ్ టవర్స్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  కోరుతోంది. 2010లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో బుకింగ్‌ చేసుకున్నామనీ, అయితే గత తొమ్మిదేళ్లలో 46 అంతస్తుల టవర్‌లో 18 అంతస్తులు మాత్రమే నిర్మించారనీ, రెండవ దశలో కూడా పనులు ప్రారంభించలేదని అసోసియేషన్  ఆరోపించింది. 

ముంబై ప్రాజెక్టు కోసం రియల్టర్లు అలహాబాద్ బ్యాంక్, జెఅండ్‌కె బ్యాంక్, సిండికేట్ బ్యాంకునుంచి రూ .517 కోట్లు తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. మరో 525 కోట్ల రూపాయలను హెచ్‌డిఐఎల్ సమీకరించిందని, ఆ ఇంటి యజమానులు భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. చాలా కాలంగాఈ ప్రాజెక్టు  నిలిచిపోవడంతో తమ సొమ్ము ఇరుక్కుపోయిందని ఆందోళనవ్యక్తం  చేశారు. గృహ కొనుగోలుదారులకు ఫ్లాట్ల అమ్మకాలపై అలహాబాద్ బ్యాంకుకు తెలియజేయకుండా హెచ్‌డీఐఎల్ మోసం చేసిందని, వివిధ రుణదాతల నుండి గృహ రుణాలు తీసుకున్నందుకు బ్యాంకు నుండి ఎన్‌ఓసిలను జారీ చేయకుండా వినియోగదారులను మోసం చేసిందని లేఖలో పేర్కొన్నారు.

కాగా పంజాబ్ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లావాదేవీలపై ఆర్‌బీఐ  ఆరు నెలల పాటు ఆంక్షలు విధించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.6,500 కోట్ల  ఈ స్కాంనకు సంబంధించిన కేసులో అక్టోబర్ 3న ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు, రాకేశ్ వాధవన్ అతని కుమారుడు సారంగ్ వాధవన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి : పీఎంసీ స్కాం : హెచ్‌డీఐఎల్‌ రుణాలే ముంచాయ్‌!

మరిన్ని వార్తలు