మార్కెట్లోకి హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘డాష్‌’

27 Aug, 2019 13:27 IST|Sakshi

ప్రారంభ ధర రూ.62,000

4 గంటల్లోనే పూర్తి చార్జింగ్‌

దీనితో 60 కిలోమీటర్ల ప్రయాణం

న్యూఢిల్లీ: ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌.. ఫాస్ట్‌ చార్జింగ్‌ ఈ–స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘డాష్‌’ పేరిట విడుదలైన తాజా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కేవలం 4 గంటల్లోనే పూర్తి చార్జింగ్‌ అవుతుంది. మొత్తం చార్జింగ్‌తో 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని ప్రారంభ ధర రూ.62,000 (ఢిల్లీ–ఎక్స్‌షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ సోహిందర్‌ గిల్‌ మాట్లాడుతూ.. ‘శక్తివంతమైన, పోర్టబుల్‌ లి–అయాన్‌ బ్యాటరీని తాజా ఈ–స్కూటర్‌లో అమర్చాం. పనితీరు, స్టైల్‌ పరంగా మరింత ఆకట్టుకుంటోంది’ అని వ్యాఖ్యానించారు. ఇక గతవారంలోనే కంపెనీ ఆప్టిమా, ఎన్‌వైఎక్స్‌ పేర్లతో రెండు ఈ–స్కూటర్లను కంపెనీ విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ.68,721–రూ.69,754 వద్ద నిర్ణయించిన సంగతి తెలిసిందే. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా.. ప్రస్తుతం 615గా ఉన్న టచ్‌–పాయింట్లను 2020 చివరి నాటికి 1,000కి చేర్చనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఏడాదికి లక్ష యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కంపెనీకి ఉండగా.. వచ్చే మూడేళ్లలో 5 లక్షల యూనిట్లకు పెంచనుంది. 

మరిన్ని వార్తలు