న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర దిగ్గజ కంపెనీ ‘హీరో మోటొకార్ప్’ తాజాగా జనవరి నుంచి వాహన ధరలు పెంచబోతున్నట్లు ప్రకటించింది. సగటున ఒక మోడల్పై రూ.400 వరకు ధరల పెంపు ఉంటుందని తెలియజేసింది. అయితే ఈ పెంపు మార్కెట్, మోడల్ ప్రాతిపదికన మారుతుందని, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల నేపథ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కాగా ఇప్పటికే పలు వాహన కంపెనీలు జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
కోరమండల్ చేతికి ఈఐడీ ప్యారీ బయో పెస్టిసైడ్ వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈఐడీ ప్యారీ ఇండియాకి చెందిన బయో పెస్టిసైడ్స్ వ్యాపారాన్ని కోరమాండల్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేయనుంది. అలాగే మరో అనుబంధ కంపెనీ యూఎస్లో ఉన్న ప్యారీ అమెరికాను సైతం దక్కించుకోనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ లావాదేవీ పూర్తవుతుందని కోరమాండల్ అంచనా వేసింది. కాగా ఈ మొత్తం డీల్ విలువ రూ.338 కోట్లు.
ఎయిర్ డెక్కన్కు డీజీసీఏ అనుమతి
ముంబై: ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తాజాగా విమానాలు నడిపేందుకు ఎయిర్ డెక్కన్కు అనుమతినిచ్చింది. దీంతో ఎయిర్ డెక్కన్కు రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ కింద ఫ్లైట్స్ నడిపే అవకాశం లభించింది. ఎయిర్ డెక్కన్కు శుక్రవారం షెడ్యూల్డ్ కమ్యూటర్ ఆపరేటర్ (ఎస్సీవో) పర్మిట్ అందించినట్లు డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. కాగా ఎయిర్ డెక్కన్.. ఉడాన్ తొలి విడత బిడ్డింగ్లో 34 రూట్లకు లైసెన్స్ దక్కించుకుంది. తొలి ఫ్లైట్ను నేడు ముంబై నుంచి జల్గావ్కు నడుపనుంది.