37 శాతం తగ్గిన హిందాల్కో లాభం

17 May, 2019 05:53 IST|Sakshi

రూ.12,733 కోట్లకు పెరిగిన ఆదాయం

ఒక్కో షేర్‌కు రూ.1.20 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ, హిందాల్కో ఇండస్ట్రీస్‌ నికర లాభం (స్టాండ్‌ అలోన్‌) గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో 37 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.377 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.236 కోట్లకు తగ్గిందని హిందాల్కో తెలిపింది. ఆదాయం మాత్రం రూ.11,892 కోట్ల నుంచి రూ.12,733 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ సతీశ్‌ పాయ్‌ చెప్పారు. . ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉండటం వల్ల నికర లాభం తగ్గిందని వివరించారు.  ఒక్కో షేర్‌కు రూ.1.20 డివిడెండ్‌(120 శాతం)ను ఇవ్వనున్నామని తెలిపారు.      వ్యాపార పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, మంచి ఫలితాలు సాధించామని సతీష్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు