హిందూస్థాన్ యూనీలివర్ ఉత్పత్తులను బ్యాన్‌ చేయండి..

8 Mar, 2019 09:23 IST|Sakshi

న్యూఢిల్లీ : ఎంఎఫ్‌జీ దిగ్గజం హిందూస్థాన్‌ యూనీలివర్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ట్విటర్‌లో "#BoycottHindustanUnilever" అనే హాష్‌ ట్యాగ్‌ తెగ ట్రెండ్ అవుతోంది. సదరు కంపెనీ భారతీయుల మనోభావాలను ముఖ్యంగా హిందువులను, వారి సంప్రదాయలను కించపరుస్తోంది.. కాబట్టి ఆ కంపెనీ ఉత్పత్తులను బ్యాన్‌ చేయండంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది.

రెడ్‌ లేబుల్‌ టీ పౌడర్‌ ప్రమోషన్‌ కోసం రూపొందించిన యాడ్‌ ఈ వివాదానికి కారణం అయ్యింది. ఈ యాడ్‌లో ఓ వ్యక్తి తన ముసలి తండ్రిని వదిలించుకోవడం కోసం కుంభమేళాకు తీసుకువస్తాడు. జన సమూహంలో తన తండ్రిని వదిలేసి ముందుకు వెళ్తాడు. అంతలోనే ఓ తండ్రి తన కుమారుడు జన సమూహంలో తప్పిపోకుండా ఉండటానికి కొడుకు చేతిని తన చేతికి కట్టేసుకుంటాడు. అది చూసి ఆ యువకుడిలో మార్పు వస్తుంది. తండ్రిని వెతుక్కుంటు వెనక్కి వెళ్తాడు. తర్వాత ఇద్దరు కూర్చుని టీ తాగుతారు. ఈ యాడ్‌తో పాటు ‘వృద్ధులను వదిలించుకోవడం కోసం చాలా మంది కుంభమేళాను ఎన్నుకుంటారు. ‍కానీ మన పెద్దల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం నిజంగా విచారకరం. ఈ రోజు మనల్ని ఇలా తయారు చేసిన వారి చేతులను వదలకండి’ అంటూ ట్వీట్‌ చేసిన ఈ యాడ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘మీరు కొత్త సంప్రదాయాలను తీసుకురాకండి. ఇది కుంభమేళాను, హిందువుల సంప్రదాయాలను అవమానించడమే’ అంటూ మండి పడుతున్నారు. ‘హిందుస్థాన్‌ యూనీలివర్‌ ఉత్పత్తులను నిషేధించండి’ అంటూ #BoycottHindustanUnilever" హాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. ఇలా విమర్శించిన వారిలో పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌ కూడా ఉన్నారు. ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారి నిజస్వరూపానికి నిదర్శనం ఈ యాడ్‌. మన దేశాన్ని ఆర్థికంగా, సిద్ధాంతపరంగా తక్కువ చేసి చూపించడమే వారి ప్రధాన అజెండా. వారి వరకూ ప్రతీది చివరకూ ఎమోషన్స్‌ను కూడా వస్తువుగానే పరిగణిస్తారు. ఇలాంటి కంపెనీ ఉత్పత్తులను మనం ఎందుకు నిషేధించకూడదం’టూ రాందేవ్‌ బాబా ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు