గృహ, వాహన లోన్లకు ఆర్‌బీఐ షాక్‌

1 Aug, 2018 15:34 IST|Sakshi

సాక్షి, ముంబై: కీలక వడ్డీరేటును పెంచుతూ రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయం రుణగ్రహీతలకు భారంగా మారనుంది. వరుసగా రెండోసారి కూడా రెపో రేటు పెంపునకు మానిటరీ పాలసీ కమిటీ మొగ్గు చూపింది. కీలకమైన వడ్డీరేటు రెపోను పావు శాతం లేదా 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో మెజారిటీ ప్రభుత్వం, ప్రయివేటు రంగ బ్యాంకులు రుణాలపై వసూలు చేసే వడ్డీరేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే పెంచిన వడ్డీరేట్లతో ఇబ్బందులు పడుతున్న బ్యాంకు వినియోగదారులపై మరింత భారం పడనుంది. రేటు పెంపుపై భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా కేంద్ర బ్యాంకు రెపో రేటును పెంచింది. గత నాలుగేళ్లలో మొదటిసారిగా గత రివ్యూలో రెపో రేటును పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయంతీసుకుంది. గత అయిదేళ్లలో రెపో పెంపు వరసగా ఇది రెండవసారి.

కాగా ఆర్‌బీఐ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను పావు శాతం పెంచడంతో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. అటు రివర్స్‌ రెపోను 6 శాతం నుంచి 6.25 శాతానికి సవరించింది. బ్యాంక్‌ రేటు, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్‌) రేట్లను 6.75 శాతంగా నిర్ణయించింది.

మరిన్ని వార్తలు