మండు వేసవిలో చల్లని గాలి!

11 Apr, 2016 00:25 IST|Sakshi
మండు వేసవిలో చల్లని గాలి!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ (ఏసీ) అనేది ఇప్పుడు అవసరాల జాబితాలో చేరిపోయింది. మెట్రో నగరాల్లోనే కాదు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ వైఖరి పెరిగిపోయింది.  నెలసరి వాయిదా చెల్లింపులు (ఈఎంఐ), సులువైన ఫైనాన్స్ విధానం, ఇంధన సామర్థ్య ఏసీలతో మెట్రో నగరాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ మార్కెట్ వృద్ధి చెందుతుందని పరిశ్రమ భావిస్తోంది. ఆన్‌లైన్ అమ్మకాల్లోనూ జోరందుకుంటుందని భావిస్తోంది. మొత్తంగా గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏసీ అమ్మకాలు 30 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని పరిశ్రమ అంచనా వేస్తోంది.

ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల మార్కెట్ వైపు ఏసీ కంపెనీలు ప్రత్యేక దృష్టిసారించాయని ప్యానసోనిక్ ఇండియా అండ్ సౌత్ ఏసియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మనీష్ కుమార్ చెప్పారు.  మెట్రో నగరాల విషయానికొస్తే.. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాల్లో హైఎండ్, యాప్ కంట్రోల్ ఏసీలు, ఇన్వెస్టర్ ఏసీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని.. ఈ విభాగం అమ్మకాల వాటా 15 శాతం మేర ఉంటుందని అంచనా.
 
ఫిబ్రవరి నుంచే ఎండలు మండేస్తున్నాయ్..:
గత నెలలో ఉత్తరాది రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు ప్రభావం ఏసీ కంపెనీలపై ఏమాత్రం పడలేదని ఎల్‌జీ ఇండియా బిజినెస్ హెడ్ విజయబాబు చెప్పారు. గతేడాది మార్చి నెలల్లో ప్రారంభ రోజుల్లో ఉత్తరాది ప్రాంతాల్లో అస్థిర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి కూడా. కానీ, ఈ ఏడాది దేశంలో వేసవికాలం కాస్త ముందుగానే వచ్చింది. ఫిబ్రవరి నుంచే ఎండలు మండేస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏసీ అమ్మకాలు పెరుగుతాయని శామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ బుటానీ చెప్పారు.  

ఈ ఏడాది వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చాలా వరకు వాతావారణ నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని ప్యానసొనిక్ ఇండియా అండ్ సౌత్ ఏసియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మనీష్ కుమార్ చెప్పారు. ఈ సానుకూల వాతావరణ పరిస్థితులు ఏసీ పరిశ్రమకు కలిసిరానున్నట్లు పేర్కొన్నారు.
 
గ్రామీణ, ఆన్‌లైన్ వ్యాపారంపై దృష్టి..
గ్రామీణ, నాన్ మెట్రో ప్రాంతాల్లో సులువైన ఫైనాన్స్ స్కీమ్స్ ద్వారా కస్టమర్లకు చేరువయ్యేందుకు, వారిని అప్‌గ్రేడ్ అయ్యేందుకు అవకాశాల్ని కల్పిస్తున్నాయని రాజీవ్ బుటానీ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏసీ అమ్మకాలు 60:40 శాతం మేర ఉంటాయని అంచనా వేశారాయన. అదేవిధంగా ఆన్‌లైన్‌లో ఏసీ అమ్మకాల్లోనూ వృద్ధి కనబరుస్తుందని ఏసీ తయారీ కంపెనీలు చెబుతున్నాయి.

‘‘ఈ ఏడాది ఆన్‌లైన్ అమ్మకాల్లో 30 శాతం వృద్ధిని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని’’ హైయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా చెప్పారు.
 
స్ప్లిట్, ఇన్వర్టర్ ఏసీలదే హవా..
ఇదిలా ఉంటే ఏసీల మార్కెట్లో ఇప్పుడు స్ప్లిట్, ఇన్వర్టర్ ఏసీలకు మంచి డిమాండ్ ఉంది. కొనుగోలుదారులు స్ప్లిట్ ఏసీలు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ఎందుకంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మార్కెట్లోకి వచ్చిన ఈ స్ప్లిట్ ఏసీలు ఖరీదు సంబంధం లేకుండా శీతలీకరణ విషయంలో అత్యంత ఆదరణ పొందుతున్నాయి. అందుకే చాలా మంది విండో ఏసీ కొనుగోలుదారులు ఇప్పుడు స్ప్లిట్ ఏసీలవైపు మొగ్గు చూపుతున్నారని ఎరిక్ బ్రగాంజా పేర్కొన్నారు. చెప్పారు.

గతంలో విండో, స్ప్లిట్ ఏసీల అమ్మకాల శాతం 50:50 గా ఉంటే ఇప్పుడది 70:30 శాతానికి మారిందని వివరించారాయన. గతేడాది ఇన్వెస్టర్ ఏసీలు 27 శాతం వృద్ధిని నమోదు చేశాయని.. ఈ ఏడాది కూడా అదే వృద్ధిని ఆశిస్తున్నామని ప్యానాసొనిక్ అంచనా వేస్తుంది. పెపైచ్చు కొనుగోలుదారులు ఏసీలు కేవలం చల్లదనంతోనే సరిపెట్టుకోవట్లేదని.. తమ ఏసీ చూడ్డానికి అందంగా ఉండాలని.. కనిష్ట శబ్ధం వద్ద పనిచేయాలని కోరుకుంటున్నారని చెప్పారు.స్ప్లిట్ ఏసీల్లోనూ ఫ్లోరల్ ప్యాట్రన్ ఏసీలకు మంచి డిమాండ్ ఉందని.. వీటినే కొనుగోలుదారులు మొదటి చాయిస్ ఇస్తున్నారన్నారు. యాప్ నియంత్రణ ఏసీలు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయని.. అవి కూడా మెట్రో నగరాలకే పరిమితమయ్యాయని తెలియజేశారు.

>
మరిన్ని వార్తలు