అమలు చేసేదెట్లా?

29 Jun, 2017 01:28 IST|Sakshi
అమలు చేసేదెట్లా?

జీఎస్టీపై వాణిజ్య పన్నుల శాఖలో ఆందోళన..
రేపు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తు సేవల పన్ను


ఇప్పటికే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో 22% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జీఎస్టీ అమలు చేయాలంటే మరో 22% పోస్టులు కావాలి. ఉద్యోగులకు జాబ్‌చార్ట్‌ ఏమిటో తేలకపోవడం సమస్యగా మారింది. సర్కిళ్లు, డివిజన్లను పెంచక పోవడంతో పనిఒత్తిడి తీవ్రం కానుంది.

♦ రూ.1.5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్‌ ఉన్న డీలర్లలో 90% వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించాలని.. 10% సెంట్రల్‌ ఎక్సైజ్‌కు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో సమస్య తలెత్తింది. దీంతో 1.70 లక్షల మంది డీలర్లను వాణిజ్య శాఖ పర్యవేక్షించాల్సి ఉంటుంది.

♦ జీఎస్టీ అమలులో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ కొరత మరో సమస్యగా పరిణమించింది. పోర్టల్‌ బిజీగా ఉండి స్తంభిస్తుండటంతో.. డీలర్లు రిజిస్ట్రేషన్లకు ధ్రువపత్రాలను సమర్పించడంలో జాప్యమవు తోంది. ఇక డీలర్లు ప్రతినెలా సమర్పించాల్సిన వివరాల పోర్టల్‌ను అప్‌గ్రేడ్‌ చేయలేదు.
 

ప్రతిష్టాత్మకంగా అమల్లోకి వస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు చుక్కలు చూపుతోంది. అసలే సిబ్బంది కొరత.. ఇప్పటికే 22 శాతం పోస్టులు ఖాళీగా ఉండడం.. ఆపై జీఎస్టీ కోసం అదనంగా మరో 22 శాతం సిబ్బంది అవసరం కావడం ఇబ్బందికరంగా మారింది. డీలర్ల సంఖ్యకు అనుగుణంగా సర్కిళ్లు, డివిజన్లను ఏర్పాటు చేయకపోవడం.. ఉద్యోగులకు ఇంకా జాబ్‌చార్ట్‌ ఏమిటో తేలకపోవడం.. తగిన సంఖ్యలో కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం.. వెబ్‌ పోర్టల్‌ సమస్యలు వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి పరిష్కారంపై వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతా ధికారులు దృష్టి సారించినా... జీఎస్టీ అమల్లోకి వచ్చాక రెండు, మూడు నెలల వరకు సమస్యలు కొనసాగే అవకా శాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శాఖ పునర్వ్యవస్థీకరణ కోసం ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.    – సాక్షి, హైదరాబాద్‌

పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు?
వాస్తవానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జీఎస్టీ అమలు బాధ్యత రెండు శాఖలపై పెట్టారు. ఒకటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ కాగా, మరొకటి ఆయా రాష్ట్రాల పరిధిలో ఉండే వాణిజ్య పన్నుల శాఖ. అయితే కేంద్ర పరిధిలోని సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ జీఎస్టీ చట్టం అమలుకు అనుగుణంగా రాష్ట్రంలో తన శాఖను పునర్వ్యవస్థీకరించుకుంది. తమ అధీనంలోకి వచ్చే డీలర్ల సంఖ్యకు అనుగుణంగా 8 కమిషనరేట్లు, 30 డివిజన్లు, 150 సర్కిళ్లను ఏర్పాటు చేసుకుని సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మాత్రం ఇంకా ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ చేయలేదు. పదేళ్ల క్రితం నుంచి ఉన్న ఒక కమిషనరేట్, 12 డివిజన్లు, 91 సర్కిల్‌ కార్యాలయా లతోనే జీఎస్టీ అమలుకు సిద్ధమయింది.

డీలర్ల లెక్క తేలకనే..
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పూర్తిగా సిద్ధం కాకపోవడానికి ఇతర కారణాలూ ఉన్నాయని చెబుతున్నారు. జీఎస్టీ కౌన్సిల్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయడంతో కొన్ని రాష్ట్రాల్లో మినహా దేశవ్యాప్తంగా ఈ సమస్య నెలకొందని అంటున్నారు. ముఖ్యంగా రూ.1.5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్‌ ఉన్న డీలర్లలో 90 శాతం వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించాలని.. కేవలం 10 శాతమే సెంట్రల్‌ ఎక్సైజ్‌కు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో సమస్య తలెత్తిందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని దాదాపు 3 లక్షల మంది డీలర్లలో 60 శాతం మంది రూ.1.5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్‌ ఉన్న వారే. అందులో 90 శాతం అంటే దాదాపు 1.70 లక్షల మంది డీలర్లను వాణిజ్య పన్నుల శాఖ పర్యవేక్షించాల్సి ఉంటుంది.

అంతేగాకుండా రూ.1.5 కోట్ల కన్నా ఎక్కువ టర్నోవర్‌ ఉన్న డీలర్ల పన్ను చెల్లింపులతో పోలిస్తే తక్కువ టర్నోవర్‌ ఉన్న వారి పన్ను చెల్లింపులు అంత పారదర్శకంగా ఉండవనే అభిప్రాయముంది. డీఫాల్టర్లు, రిటర్నులు ఇవ్వని డీలర్లు ఈ జాబితాలోనే ఎక్కువగా ఉంటారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖపై అదనపు భారం పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇక జీఎస్టీ అమలుకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఉన్నతాధికారులు కార్యాచరణ వేగవంతం చేశారు. ఉద్యోగ సంఘాలు కోరినన్ని కాకపోయినా సర్కిళ్లు, డివిజన్లు పెంచే ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

ఉద్యోగుల్లో ఆందోళన
కనీసం 2 వేల మంది డీలర్లకు ఒక సర్కిల్‌ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 153 సర్కిళ్లు, 20 డివిజన్లు, తొమ్మిది కమిషనరేట్లు, ఒక చీఫ్‌ కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా పదోన్నతులిచ్చి దాదాపు 1,600 ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతున్నాయి. ఇక జీఎస్టీ అమలుపై ఏర్పాటు చేసిన శాఖాపరమైన కమిటీ కూడా కొత్తగా 5 కమిషనరేట్లు, 8 డివిజన్లు, 49 సర్కిళ్లు ఏర్పాటు చేసి 864 పోస్టులను భర్తీ చేయాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో శాఖ పునర్వ్యవస్థీకరణపై తర్జనభర్జన జరుగుతోంది. ఇక రెండు, మూడు రోజుల్లోనే (జీఎస్టీ కౌన్సిల్‌ తదుపరి సమావేశం ముగిసిన తర్వాత) ఉద్యోగుల జాబ్‌చార్ట్‌ కూడా వెలువడనుంది.

తప్పని ఆన్‌లైన్‌ తంటాలు
జీఎస్టీ అమలు విషయంలో రాష్ట్రంలో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ కొరత మరో సమస్యగా పరిణమించింది. పోర్టల్‌ బిజీగా ఉండి స్తంభించిపోతుండడంతో.. డీల ర్లు రిజిస్ట్రేషన్ల కోసం సమర్పించాల్సిన ధ్రువపత్రా లను తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. దీనికి తోడు డీలర్లు సమర్పించాల్సిన వివరాలకు సంబం« దించి చాంతాడంత జాబితా ఉండడంతోనూ రిజిస్ట్రేష న్‌కు చాలా సమయం తీసుకుంటోంది. ఇక డీలర్లు ప్రతినెలా సమర్పించాల్సిన, అప్‌లోడ్‌ చేయాల్సిన వివరాలకు సంబంధించి ఇంతవరకు పోర్టల్‌ను అప్‌గ్రేడ్‌ చేయలేదు. మరోవైపు జీఎస్టీ అమలు కోసం ప్రతి అధికారికి డిజిటల్‌ సిగ్నేచర్‌ ఉండడం, దాని ద్వారానే లాగిన్‌ అవ్వాల్సి ఉండడంతో సర్కిల్‌ కార్యాలయాల్లో కంప్యూటర్ల కొరత ఏర్పడనుంది.

సర్కిళ్ల పెంపుపై ప్రతిపాదనలు

జీఎస్టీ అమలు నేపథ్యంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల ఉద్యోగుల జేఏసీ నేతృత్వంలో ఆ శాఖ ఉద్యోగులు బుధ వారం కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో సమావేశమ య్యారు. వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్‌ ఆఫీసర్ల అసోసియే షన్‌ (టీసీటీజీవోఏ), వాణిజ్య పన్నుల శాఖ నాన్‌గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ సెంట్రల్‌ అసోసియేషన్‌ (టీసీటీఎన్‌జీఓసీఏ), వాణి జ్య పన్నుల శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం (టీసీ టీసీ– ఐVఏ) ప్రతినిధులు పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఆ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏ ఉద్యోగికీ జీఎస్టీ వల్ల ఇబ్బంది ఉండదని, పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని సర్కిళ్ల పెంపు ప్రతిపాదనలను కూడా ప్రభుత్వానికి పంపించామని ఈ సందర్భంగా కమిషనర్‌ చెప్పినట్టు సమాచారం.

 త్వరగా పునర్వ్యవస్థీకరించాలి 
‘‘జీఎస్టీ అమలు కోసం వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్య వస్థీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా విజ్ఞప్తి మేరకు ప్రతిపా దనలు సిద్ధం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, అధికారులకు కృతజ్ఞ తలు తెలియజేస్తున్నాం. కానీ ఇది ఇప్పటికే ఆలస్యమైంది. వీలైనంత త్వరగా పున ర్వ్యవస్థీకరణపై కసరత్తు పూర్తి చేయాలి. అవసరమైన మేరకు ఉద్యోగులను పెంచుకుని సర్కిళ్లు, డివిజన్లు, కమిషనరేట్లు పెంచాలి..’’    – తూంకుంట వెంకటేశ్వర్లు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌

మరిన్ని వార్తలు