రూ.లక్ష పెట్టుబడి ఉంటే ఏం చేయొచ్చు..?

1 Jul, 2020 14:20 IST|Sakshi

ఈ ఏడాది చివరి వరకు అస్థిరతలే

బంగారం ధరల్లో అప్‌ట్రెండ్

మార్కెట్‌ నిపుణుల సలహాలు

ఈక్విటీ మార్కెట్లో అస్థిరత వాతావరణం నాణ్యమైన స్టాకులను ఎంపిక చేసుకునేందుకు, ఫోర్ట్‌ఫోలియోలో మార్పు చేర్పులకు చక్కని అవకాశాన్ని కల్పిస్తుంది. అనిశ్చిత పరిస్థితుల్లో స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడుల తీరు ఎలా ఉండాలి అనే సందేహం ఇన్వెస్టర్లను వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో టాప్‌ బ్రోకరేజ్‌ సంస్థలు ఇన్వెస్టర్లకు ఓ చక్కని సలహానిస్తున్నాయి. తమ వద్ద ఉన్న మొత్తం సంపదలో 50-60శాతం ఈక్విటీల్లో, 20-30శాతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో, మిగిలినది బంగారంలో పెట్టుబడులు పెట్టాలని వారు చెబుతున్నారు. 

 ‘‘ప్రస్తు‍్తత పరిస్థితుల్లో స్టాక్‌ మార్కెట్లో రూ.1 లక్షను పెట్టుబడి పెట్టాలనుకుంటే రూ.60వేలు ఈక్విటీల్లో, రూ.20వేలు స్థిర ఆదాయం ఇచ్చే సాధనాల్లో, మిగిలిన రూ.20వేలు బంగారంలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.’’ అని సామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా అభిప్రాయపడ్డారు. 

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌, జియోజిత్‌ ఫైనాన్స్‌ బ్రోకరేజ్‌ సంస్థల మేనేజర్లు సైతం 60శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో, 3శాతం స్థిరమైన ఆదాయం ఇచ్చే సాధనాల్లో, 10శాతం బంగారంలో పెట్టుబడులు పెడితే మం‍చిదని ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ఈ ఏడాది చివరి వరకు అస్థిరతలే: మోతీలాల్‌ ఓస్వాల్‌ 
ఆర్థిక వ్యవస్థ కోవిడ్-19 పూర్వ స్థితికి చేరుకునేందుకు మరింత కాలం పట్టనుండటం, పెరుగుతున్న నిరుద్యోగం సమస్యల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ ఈ ఏడాది చివరి వరకు అస్థిరంగానే ఉంటుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. ప్రస్తుతం ఫైనాన్స్‌ సెక్టార్‌లో ఉన్న ఒత్తిడి భయాలు తొందర్లోనే ఇతర రంగాలకు వ్యాప్తి చెందుతాయని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 

బంగారం ధరల్లో అప్‌ట్రెండ్: బులియన్‌ నిపుణులు
బంగారం ధర అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుందని బులియన్‌ విశ్లేషకులు అంటున్నారు. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై బలహీన అవుట్‌లుక్‌ ఇందుకు తోడ్పడతాయని వారంటున్నారు. గతేడాది బంగారంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు 37శాతం ఆదాయం వచ్చింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 12శాతం నష్టాన్ని చవిచూసింది. ఈ ధోరణి బంగారానికి సానుకూలంగా ఉంటుందని విశ్లేషకులు చెప్పుకొచ్చారు. 
 

మరిన్ని వార్తలు