ఈ సారి షాపింగ్ 'పండగే'!

9 Oct, 2018 00:25 IST|Sakshi

దసరా, దీపావళి సేల్స్‌కు రంగం సిద్ధం

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌ భారీ ఆఫర్లు

పేటీఎం మహా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

ఈ నెల 10–15 మధ్య షాపింగ్‌ ఉత్సవాలు

ఈసారి డిస్కౌంట్లు మొబైల్స్‌కే పరిమితం కాదు

ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఉత్పత్తులపైన కూడా...

గతేడాది ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ సమయంలో ప్రమోద్‌ రూ.33,000 రూపాయిల మొబైల్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ పాత మొబైల్‌ ఫోన్‌ ఎక్సేంజ్‌పై అదనంగా రూ.3,000 డిస్కౌంట్‌ ఆఫర్‌ చేయడాన్ని చూశాడు. తనకు తెలిసిన వ్యక్తి దగ్గర రూ.3,000 పెట్టి పాత మొబైల్‌ కొని దాన్ని ఎక్సేంజ్‌కు పెట్టాడు.

ఆ మొబైల్‌కు ఈ కామర్స్‌ సంస్థ రూ.5,000 విలువ కట్టింది. అప్‌ఫ్రంట్‌ డిస్కౌంట్‌ కింద రూ.3,000 తగ్గింపు లభించింది. బ్యాంకు కార్డుపై మరో 10 శాతం డిస్కౌంట్‌ లభించింది. ఇతర తగ్గింపులు కూడా పోను చివరికి ఆ మొబైల్‌ను ప్రమోద్‌ కేవలం రూ.20,000కే సొంతం చేసుకున్నాడు. రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఈ కామర్స్‌ సంస్థలు నిర్వహించే షాపింగ్‌ ఫెస్టివల్స్‌లో తక్కువ ధరలకే ఉత్పత్తులను ఎలా సొంతం చేసుకోవచ్చన్నది ఈ ఉదాహరణ తెలియజేస్తోంది.  

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, పేటీఎం సంస్థలు ఈ నెల 10– 15 తేదీల మధ్య భారీ ఎత్తున విక్రయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు వచ్చే నెలలో దీపావళికి ముందు మరోసారి పెద్ద ఎత్తున ఫెస్టివల్‌ సేల్స్‌ కూడా నిర్వహించనున్నాయి. ఈ అమ్మకాల సందర్భంగా మంచి డీల్స్‌ కచ్చితంగా ఉంటుంటాయి.

గతానికి భిన్నంగా ఈ ఏడాది పండుగల షాపింగ్‌ చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో నమోదైన విక్రేతలు అంచనా వేస్తున్నారు. ‘‘ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌ కొనుగోలు చేసిన తర్వాత పోటీ మరింత తీవ్రతరం అయింది. అంతర్జాతీయ బ్రాండ్లు తక్కువ ధరలకే మార్కెట్లో పెద్ద వాటాను ఆక్రమించనున్నాయి’’ అని క్యాష్‌కరో డాట్‌ కామ్‌ సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ పేర్కొన్నారు.  

మొబైల్స్‌ ఒక్కటే కాదు...
గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫెస్టివల్స్‌ను గమనిస్తే... ఎక్కువ ఆఫర్లు స్మార్ట్‌ఫోన్లపైనే ఉంటుండేవి. దీనికి కారణం ఆన్‌లైన్‌లో ఎక్కువగా అమ్ముడుపోయే ఉత్పత్తులు స్మార్ట్‌ఫోన్లు కావడమే. కానీ, ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు ఈ సారి ఆఫర్లను మరిన్ని విభాగాల్లోని ఉత్పత్తులపైనా అందించనున్నాయి.

‘‘వినియోగదారులు కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ (మన్నికైన ఉత్పత్తులు)పై తగ్గింపులను ఆశిస్తున్నారు. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్లు, ఏసీలపై డిస్కౌంట్‌ కోరుకుంటున్నారు. ఈ విభాగంలోనే డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అదే సమయంలో స్మార్ట్‌ఫోన్లపై మార్జిన్లు చాలా తగ్గిపోయాయి’’ అని కంపేర్‌రాజా, కూపర్‌రా జా సంస్థల అధినేత రోహిత్‌చుగ్‌ చెప్పారు. స్మార్ట్‌ఫోన్లపై ఎలానూ డిస్కౌంట్లు ఉంటాయి. కాకపోతే ఈ సారి సేల్స్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్‌పై అధిక డిస్కౌం ట్లను ఆశించొచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.  

క్యాష్‌బ్యాక్‌
వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు, అదే సమయంలో కస్టమర్ల సంఖ్యను భారీగా పెంచుకునేందుకు ఈ కామర్స్‌ సంస్థలు మార్కెటింగ్‌ సంస్థలకు కొంత కమీషన్లు చెల్లిస్తుంటాయి. యూజర్లను తమ వెబ్‌సైట్‌కు మళ్లించడం అవి చేస్తుంటాయి. క్యాష్‌కరో డాట్‌ కామ్, గోపైసా డాట్‌కామ్‌ తదితర సంస్థలు ఇదే పనిచేస్తుంటాయి. అయితే ఇవి కస్టమర్లకు తమకు వచ్చే కమీషన్‌లో కొంత తిరిగి ఇవ్వడం అదనపు ఆకర్షణ. ‘‘క్యాష్‌ బ్యాక్‌ ఎంతన్నది ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. 2 శాతం నుంచి 35 శాతం వరకు ఉండొచ్చు.

మా కమీషన్‌లో 70–80 శాతాన్ని తిరిగి వినియోగదారులకు బదిలీ చేస్తాం’’ అని క్యాష్‌కరో ఫౌండర్‌ స్వాతి భార్గవ తెలిపారు.ఈ క్యాష్‌ బ్యాక్‌ను తదుపరి లావాదేవీ కోసం వినియోగించుకోవచ్చన్నారు. కొన్ని సంస్థలయితే ఈ క్యాష్‌ బ్యాక్‌ మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాయి. మార్కెటింగ్‌ అఫిలియేట్‌ సంస్థలు డీల్స్‌ ప్రచారం విషయంలో ఈ కామర్స్‌ సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. ఈ సంస్థల పోర్టళ్లను పరిశీలిస్తే కూపన్‌ కోడ్స్‌ కనిపిస్తాయి. వీటిని ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై వినియోగించడం ద్వారా, అదనపు డిస్కౌంట్‌ కూడా పొందొచ్చు.


తగ్గింపు అవకాశాలు
ధరలను వివిధ పోర్టళ్లలో ఏవిధంగా ఉన్నదీ చూపించేందుకు కొన్ని పోర్టళ్లు ఉన్నాయి. ప్రైస్‌దేఖో డాట్‌ కామ్, కంపేర్‌రాజా, మైస్మార్ట్‌ప్రైస్, బైహట్కే, స్మార్ట్‌పిక్స్‌ సంస్థలన్నీ ఈ సేవలు అందించేవే. ఏ ఏ పోర్టళ్లలో ఫలానా ప్రొడక్ట్‌ ధర ఎంతున్నది, క్రెడిట్‌/డెబిట్‌ కార్డులపై ఏదైనా తగ్గింపు ఆఫర్లున్నాయా? అన్నవి చూపిస్తాయి.

ఒక్క పేజీలోనే అన్ని డీల్స్‌ను చూసి నిర్ణయం తీసుకునే సౌకర్యం ఉంటుంది. యాప్స్‌లో ప్రత్యే క డీల్స్‌ అన్నవి గతంలోనే ఎక్కువగా ఉండగా, ఈ సారి తగ్గిపోనున్నాయి. ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు వాటిని వెబ్‌సైట్లలోనే చూసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఈ కామర్స్‌ సంస్థలు గుర్తించడమే ఇందుకు కారణమని రోహిత్‌చుగ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు