భారత్‌కు హైబ్రిడ్‌ కార్లు మేలు

25 May, 2018 01:03 IST|Sakshi
యారిస్‌తో విశ్వనాథన్, వినయ్‌ కన్సల్‌ (కుడి)

టయోట వైస్‌ చైర్మన్‌ విశ్వనాథన్‌ 

ఎలక్ట్రిక్‌ వాహనాలకు మరింత సమయం  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘‘దేశీయంగా 2030 నుంచి అన్ని వాహనాలు ఎలక్ట్రిక్‌వే ఉండాలని గతంలో కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ సమయానికి చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు సాధ్యం కాదని ప్రభుత్వం గ్రహించి తన నిర్ణయంపై వెనుకడుగు వేసింది. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలే కొత్తగా రోడ్డెక్కాలంటే 2050 తర్వాతనే సాధ్యం అవుతుంది’’ అని టయోట కిర్లోస్కర్‌ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ విశ్వనాథన్‌ అభిప్రాయపడ్డారు. ఇక్కడి మార్కెట్‌కు హైబ్రిడ్‌ కార్లు అనువైనవని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా టయోట 34 రకాల హైబ్రిడ్‌ మోడళ్లను తయారు చేస్తోందన్నారు.

ఈ విభాగంలో ఇప్పటి వరకు 1.1 కోట్ల వాహనాలను విక్రయించిందని చెప్పారు. కస్టమర్ల డిమాండ్, పన్నుల ఆధారంగా భారత్‌లోనూ దశలవారీగా వీటిని ప్రవేశపెడతామన్నారు. గురువారమిక్కడ టయోట కొత్త వాహనం యారిస్‌ను విడుదల చేసిన సందర్భంగా డీజీఎం వినయ్‌ కన్సల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. యారిస్‌ కోసం 60,000 పైగా ఎంక్వైరీలు వచ్చాయన్నారు.   

మరిన్ని వార్తలు