న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల వ్యవస్థను మరింత అభివృద్ధి చేసే దిశగా ట్యాక్సీ సేవల సంస్థ ఓలాలో దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్ మోటార్స్, కియా మోటార్స్ దాదాపు 300 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా మూడు సంస్థలూ కలిసి భారత మార్కెట్కు అనువైన ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయనున్నాయి. ఈ భాగస్వామ్యంతో ఓలా డ్రైవర్లకు వివిధ రకాల ఆర్థిక సేవలు (లీజు, ఇన్స్టాల్మెంట్స్ వంటివి) లభించనుండగా, ప్రయాణికులకు మెరుగైన సేవలు లభిస్తాయని మూడు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
హ్యుందాయ్ ఇప్పటికే కార్ షేరింగ్ సంస్థ రెవ్లో కూడా పెట్టుబడులు పెట్టింది. దాదాపు రూ. 100 కోట్లు సమీకరించిన రెవ్.. దేశీయంగా 30 నగరాలకు కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం రెవ్ 11 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.