ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్స్‌కు ఐటీ నోటీసులు

22 Nov, 2018 16:53 IST|Sakshi

వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ డీల్‌పై ఐటీ కన్ను

ఫౌండర్లు బిన్నీ, సచిన్‌ సహా 35మందికి ఐటీ నోటీసులు

ఈ కామర్స్‌ మార్కెట్‌లో అతిపెద్ద డీల్‌గా నిలిచిన వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌ ఒప‍్పందంపై ఆదాయపన్ను శాఖ ఆరా తీస్తోంది.  ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్‌,  సచిన్ బన్సల్‌లకు  ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. వాల్‌మార్ట్‌ ఒప్పందానికి సంబంధించి ఆదాయ వివరాలను వెల్లడించాల్సిందిగా  కోరింది. అలాగే వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందంలో భాగంగా చేతులు మారిన నగదు వివరాలు అందించాలని కోరింది. నికర లాభం, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను కూడా ఐటీ శాఖ కోరినట్టు సమాచారం.వీరితోపాటు సంస్థలోని 35మంది వాటాదారులకు కూడా నోటీసులు జారీ చేసింది.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం భారతీయులైన సచిన్‌,బిన్నీ బన్సల్‌ ద్వయం 20శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే  వాటా అమ్మకం,  పన్ను చెల్లింపులకు సంబంధించి ఐటీ శాఖ  నుంచి కొన్ని నెలల క్రితమే నోటీసులు అందాయనీ, అయితే ఆ నోటీసులకు సంబంధించి మేము అప్పుడే వివరణ ఇచ్చామని కో  ఫౌండర్‌ బిన్నీ బన్సల్  తెలిపారు.

కాగా అంతర్జాతీయ  ఈ కామర్స్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌, దేశీయ దిగ‍్గజం ఫ్లిప్‌కార్టులో మేజర్‌ (77శాతం) వాటాను కొనుగోలు చేసింది. సెప్టెంబర్‌లో  ప్రకటించిన ఈ డీల్‌ విలువు దాదాపు రూ.13750కోట్లు (16 బిలియన్‌ డార్లు). ఒప్పందంలో భాగంగా ఇప్పటికే సుమారు రూ.7439కోట్లు వాల్‌మార్ట్ చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను వెల్లడించాల్సిందిగా ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఈ డీల్‌ ముగిసిన అనంతరం ఫౌండర్లలో ఒకరైన సచిన్‌ బన్సల్‌  ఫ్లిప్‌కార్ట్‌లో తన 5-6శాతం వాటాను అమ్ముకొని సంస్థకు గుడ్‌ బై చెప్పారు. మరో ఫౌండర్‌  బిన్సీ బన్సల్‌  లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ నెలలో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో పదవికి రాజీనామా చేశారు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో అతిపెద్ద వాటాదారుడుగా కొనసాగుతానని  ప్రకటించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు