ఐసీఐసీఐకు ప్రొవిజన్ల దెబ్బ : లాభాల్లో క్షీణత

30 Jan, 2019 18:50 IST|Sakshi

సాక్షి,ముంబై : ప్రయివేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ లిమిటెడ్‌ క్యూ3 ఫలితాల్లో నిరాశపర్చింది. డిసెంబరు ముగిసిన  త్రైమాసికంలో నికర లాభాలు 2.8 శాతం క్షీణించాయి. తద్వారా ఎనలిస్టులు అంచనాలను మిస్‌ చేసింది. 2017డిసెంబరు క్వార్టర్‌లో సాధించిన రూ.1650 కోట్ల లాభాలతో పోలిస్తే ప్రస్తుత క్వార్టర్‌లో రూ. 1605 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది.  

అయితే మొత్తం ఆదాయం మాత్రం 19.8శాతం మేర పుంజుకుంది. రూ. 20,163 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గత ఏడాది ఇది రూ. 16,832 కోట్లుగా ఉంది.  ఎసెట్‌ క్వాలిటీ కూడా పుంజుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 8.54 నుంచి 7.75శాతానికి తగ్గాయి.  నికర నిరర్ధక ఆస్తుల రేషియో కూడా 3.65 శాతం నుంచి 2.58 శాతానికి దిగి వచ్చింది. అయితే  ప్రొవిజన్లు బ్యాంకు ఫలితాలను దెబ్బతీశాయి ఎనలిస్టులు పేర్కొన్నారు.  గత క్వార్టర్‌తో పోలిస్తే 6శాతం, వార్షిక ప్రాతిపదికన 19శాతం  ఎగిసి రూ. 4, 244కోట్లుగా నిలిచాయి.

మరోవైపు రెండవ అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్నఆరోపణలతో  మాజీ సీఈవో చందా కొచర్‌పై ఎప్‌ఐఆర్‌ నమోదైంది. అటు ఐసీఐసీఐ-వీడియోకాన్‌​ కుంభకోణానికి సంబంధించి జస్టిస్‌ శ్రీ కృష్ణ కమిటీ తన రిపోర్టును దర్యాప్తు సంస్థకు అందించింది. ఈ స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచర్‌ నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడ్డారని  పేర్కొంది. ఈ వార్తలు రేపటి బ్యాంకు షేర్‌ ట్రేడింగ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. 

>
మరిన్ని వార్తలు