పడిపోయిన ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ

27 Jul, 2017 19:00 IST|Sakshi
పడిపోయిన ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ
ముంబై : ప్రైవేట్‌ రంగ దిగ్గజ బ్యాంకులో అగ్రగామిగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ప్రైవేట్‌ లిమిటెడ్‌ లాభాల్లో పడిపోయింది. గురువారం ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సర క్యూ1 ఫలితాల్లో బ్యాంకు నికర లాభాలు 8.2 శాతం తగ్గాయి. మొండిబకాయిలు విపరీతంగా పెరగడంతో పాటు, క్రెడిట్‌ గ్రోత్‌ మందగించడంతో బ్యాంకు లాభాలకు గండికొట్టాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో రూ.2,232.35 కోట్లగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు ఈ ఏడాది జూన్‌ క్వార్టర్‌లో రూ.2,049 కోట్లకు తగ్గాయి. గత క్వార్టర్‌ నుంచి అడ్వాన్స్‌లు ఏ మాత్రం మారకుండా... రూ.4.64 ట్రిలియన్లగానే ఉన్నాయి. సీక్వెన్షియల్‌ ఆధారితంగా బ్యాంకు డిపాజిట్లు 0.77 శాతం క్షీణించి రూ.4.86 ట్రిలియన్లుగా నమోదైనట్టు ఐసీఐసీఐ తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు ఏకంగా బ్యాంకువి 56.5 శాతం పెరిగాయి. దీంతో గతేడాది రూ.27,562.93 కోట్లగా ఉన్న బ్యాంకు ఎన్‌పీఏలు ఈ ఏడాది రూ.43,147.64 కోట్లకు ఎగిశాయి.
 
క్వార్టర్‌ క్వార్టర్‌కు కూడా బ్యాంకు ఎన్‌పీఏలు 1.4 శాతం పెరిగినట్టు ఐసీఐసీఐ తెలిపింది. మొత్తం రుణాల్లో ఎన్‌పీఏలు 7.89 శాతం నుంచి  7.99 శాతం పెరిగాయి. నికర ఎన్‌పీలు, మొండిబకాయిలు లోన్‌ బుక్‌లో 4.86 శాతం ఎగిసినట్టు తెలిసింది. ఇటీవలే బ్యాంకులకు భారీగా రుణాలు ఎగొట్టిన మాల్యా వంటి ఘనులు 12 మంది ఉన్నట్టు ఆ‍ర్‌బీఐ గుర్తించిన సంగతి తెలిసిందే. వారిపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించింది. ఈ ఎగొట్టిన రుణాల్లో ఐసీఐసీఐ బ్యాంకుకు ఉన్నవి రూ.6,889.46 కోట్లు. ఈ రుణగ్రహీతల నుంచి వచ్చే డిఫాల్ట్ ప్రమాదాన్ని ముందస్తుగా ఎదుర్కొనడానికి బ్యాంకు రూ.2,827.66 కోట్లను పక్కకు తీసి పెట్టింది. 
 
రుణాలు ఇవ్వడంతో బ్యాంకు ఆర్జించే ప్రధాన ఆదాయం లేదా నికర వడ్డీ ఆదాయం 8.36 శాతం పెరిగి, రూ.5,589.84 కోట్లగా నమోదయ్యాయి. ఫీజులు, కమిషన్లను నుంచి వచ్చిన వడ్డీరహిత ఆదాయాలు 1.21 శాతం తగ్గాయి. గతేడాది రూ.3,429.26 కోట్లగా ఉన్న ఈ ఆదాయాలు ఈ ఏడాది రూ.3,387.91 కోట్లకు తగ్గినట్టు తెలిసింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు ఈ క్వార్టర్‌లో 3.75 శాతం పెరిగినట్టు బ్యాంకు తెలిపింది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 1 శాతం డౌన్‌ అయి, రూ.307.05 గా ముగిశాయి.  
>
మరిన్ని వార్తలు