ఐసీఐసీఐ‌: తొలిసారి స్పందించిన సర్కార్‌

4 Apr, 2018 18:51 IST|Sakshi
ఐసీఐసీఐ బ్యాంకు(ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ - వీడియోకాన్‌ రుణ వివాదం విషయంలో ప్రభుత్వం  తొలిసారి  స్పందించింది. ఈ విషయంలో ప్రభుత్వం చేసేదేమీ లేదని కార్పొరేట్‌ వ్యవహరాల  శాఖ  (ఎంసీఏ) సెక్రటరీ  ఇంజేటి  శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. రిజర్వ్‌బ్యాంక్‌ ఈ కేసును పరిశీలిస్తోందని తెలిపారు. మరోవైపు  సీఈవో చందా కొచర్‌కు ఇప్పటికే పూర్తి మద్దతును  ఐసీఐసీఐ  బోర్డు  ప్రకటించిన సంగతి విదితమే. తాజాగా   ఆమెపై స్వతంత్ర దర్యాప్తునకు ఐసీఐసీఐ అంగీకరించలేదు.  

దాదాపు 3250 కోట్ల రూపాయల వీడియోకాన్‌-ఐసీఐసీఐ రుణ వ్యవహారాన్నివెలుగులో తెచ్చిన అరవింద్ గుప్తా ఫోరెన్సిక్ ఆడిట్‌ డిమాండ్ చేసిన నేపథ్యంలో   బాహ్య ఏజెన్సీలతో స్వతంత్ర దర్యాప్తును బ్యాంకు వ‍్యతిరేకించింది.  చందా  కొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌తో బిజినెస్‌ వ్యవహారాల్లో భాగంగానే వీడియోకాన్‌కు  గ్రూపునకు రుణాలిచ్చారన‍్న ఆరోపణలను తీవ్రంగా  ఖండించింది.  కాగా ఈ వ్యవహారంలో సీబీఐ ఇప్పటికే దర్యాప్తును మొదలుపెట్టింది. ముఖ్యంగా వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ ధూత్‌, దీపక్‌కొచర్‌ పై ప్రాథమిక దర్యాప్తును సీబీఐ  చేపట్టింది. ఈ మేరకు కొన్ని కీలక పత్రాలను సీబీఐ అధికారుల పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే దీపక్‌ కొచర్‌కు చెందిన న్యూపవర్‌ రెన్యువబుల్స్‌  కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు