ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి గ్రోత్ ఫండ్

3 Jun, 2014 00:24 IST|Sakshi

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మ్యూచువల్ ఫండ్ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తాజాగా గ్రోత్ ఫండ్-సిరీస్1ను ఆవిష్కరించింది. సెన్సెక్స్, నిఫ్టీలను మించి రాబడులు అందించే అవకాశాలున్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఈ ఫండ్ ప్రధానోద్దేశమని ఫండ్ మేనేజర్ వెంకటేశ్ సంజీవి సోమవారం ఇక్కడ తెలిపారు. ఇందులో భాగంగా బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా, ఆటోమొబైల్ తదితర రంగాలకు చెందిన 40-60 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామని ఆయన వివరించారు.
 
 ఈ ఫండ్ ద్వారా సుమారు రూ. 500-1000 కోట్ల దాకా నిధులు సమీకరించాలని యోచిస్తున్నట్లు, ఇందులో 40 శాతం మొత్తాన్ని లార్జ్ క్యాప్ షేర్లకు, మిగతాది మిడిల్.. స్మాల్ క్యాప్ షేర్లకు కేటాయించనున్నట్లు సంజీవి పేర్కొన్నారు. మూడేళ్ల ఈ క్లోజ్డ్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్‌లో కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 16 దాకా ఆఫర్ ఉంటుంది. ఎకానమీ కోలుకుంటుండటం, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుతో మార్కెట్ సెంటిమెంట్లు సానుకూలంగా ఉండటం, అటు స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం భారత్‌కి సానుకూల అంశాలని వివరించారు. ప్రస్తుతం ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే దేశీ మార్కెట్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు