ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు అనుబంధ కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ జూన్ త్రైమాసికంలో రూ.134 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.118 కోట్లతో పోలిస్తే 13 శాతం పెరిగింది. ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.436 కోట్లుగా నమోదైంది. ఈక్విటీ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం తక్కువే ఉన్నప్పటికీ బ్రోకింగ్ సేవల ద్వారా వచ్చే ఆదాయం 227 కోట్ల నుంచి రూ.230 కోట్లకు పెరిగింది.
ఇనిస్టిట్యూషనల్ బ్రోకింగ్ ఆదాయం 22 శాతం వృద్ధి చెందిందని, డిస్ట్రిబ్యూషన్ ఆదాయం రూ.17 శాతం వృద్ధితో రూ.99 కోట్ల నుంచి రూ.116 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. జూన్ క్వార్టర్లో కొత్తగా 1.1 లక్షల క్లయింట్లు తోడయ్యారు. దీంతో మొత్తం క్లయింట్ల సంఖ్య 41 లక్షలకు చేరింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సోమవారం స్టాక్ ధర 3.44 శాతం లాభపడి రూ.312.85 వద్ద క్లోజయింది.