కేరళ వరదలు: దిగ్గజ బ్యాంకు ఉదారత

17 Aug, 2018 21:08 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రైవేటురంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చింది.ముఖ్యమంత్రి సహాయ నిధికి 10కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన అన్నిలేట్‌ ఫీజులను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. గృహ, వాహన, వ్యక్తిగత లోన్లపై  కస‍్టమర్లు చెల్లించాల్సిన నెలవారీ వాయిదాల చెల్లింపుల లేట్‌ ఫీజును వసూలు చేయమని స్పష‍్టం చేసింది. అలాగే క్రెడిట్‌కార్డు బిల్లులపై చెల్లింపులపై లేట్‌ ఫీజును రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

రూ.10 కోట్లు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఐసిఐసిఐ బ్యాంకు అందివ్వనుందని కేరళ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ టొమ్ జోస్ వెల్లడించారు. రూ .8 కోట్లు విరాళంగాను, మరో రెండు కోట్ల రూపాయలు వరదల్లో  దెబ్బతిన్న 14 జిల్లాల్లో రిలీఫ్‌ మెటీరియల్‌ కొనుగోలుకు వెచ్చించనుందని తెలిపారు.

ప్రకృతి బీభత్సానికి కేరళ ఇంకా విలవిల్లాడుతూనే ఉంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. లక్షలాది ప్రజలు సహాయక శిబిరాల్లో బిక్కు బిక్కు మంటూ రోజులు గడుపుతున్నారు. అనేక జిల్లాల్లో రవాణా వ్యవస్థ భారీగా ప్రభావితమైంది. అనేక రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. కేరళ ప్రజలకు సహాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ విజ్ఞప్తి చేశారు. దీనికి పలు రాష్ట్ర  ప్రభుత్వాలు ఇప్పటికే స్పందించాయి. మరోవైపు కేరళ వరద పరిస్థితిని  పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళకు బయలు దేరి వెళ్లారు. రేపు (శనివారం) ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు