ఐడీబీఐ బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మెకు పిలుపు

13 Jul, 2018 13:14 IST|Sakshi
ఐడీబీఐ బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : ఐడీబీఐ బ్యాంక్‌ అధికారులు కొందరు జులై 16 నుంచి ఆరు రోజుల పాటు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బ్యాంకు అధికారులు నోటీసులను ఐడీబీఐ బ్యాంక్‌కు అందించారు. తమకు నోటీసులు అందినట్లు రెగ్యులేటరీ సంస్థలకు ఐడీబీఐ బ్యాంకు సమాచారం అందించింది. జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను కొనుగోలు, వేతనానికి సంబంధించిన సమస్యలపై నిరసనగా కొందరు ఐడీబీఐ అధికారులు సమ్మెచేస్తున్నట్టు తెలిసింది. 

2018 జూలై 16 నుంచి 2018 జూలై 21 వరకు కొందరు అధికారులు సమ్మెకు దిగబోతున్న నోటీసులను తాము అందుకున్నామని ఐడీబీఐ బ్యాంక్‌, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2012 నవంబరు నుంచి ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల వేతనాలను సవరించలేదు. వేతన సవరణ విషయంలో గత ఏడాదే ఓ సారి సమ్మె నోటీసు ఇచ్చినా మేనేజ్‌మెంట్‌ ఇచ్చిన హామీతో విరమించుకున్నారు. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ఎల్‌ఐసీకి విక్రయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ‘ఆల్‌ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌’ ఇప్పటికే కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీకి వినతిపత్రం అందించింది. ఐడీబీఐ అధికారులు, ఉద్యోగుల దగ్గర సమ్మెకు దిగడమే తప్ప మరో ఆప్షన్‌ను లేదని పేర్కొంది. 

మరిన్ని వార్తలు