ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు రూ.3,602 కోట్లు

15 Nov, 2018 00:11 IST|Sakshi

32%కి చేరిన మొండి బకాయిలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.198 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.3,602 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలు బాగా పెరగడం, వడ్డీ ఆదాయం తక్కువగా ఉండటంతో నికర నష్టాలు ఈ స్థాయికి చేరాయని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.8,302 కోట్ల నుంచి రూ.6,162 కోట్లకు తగ్గిందని ఈ బ్యాంక్‌కు కొత్తగా సీఈఓ, ఎమ్‌డీగా నియమితులైన రాకేశ్‌ శర్మ చెప్పారు. నికర వడ్డీ ఆదాయం రూ.1,657 కోట్ల నుంచి 22 శాతం తగ్గి రూ.1,301 కోట్లకు పరిమితమయిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్‌ 2.17 శాతం నుంచి 1.80 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.
 
మరింత తీవ్రమైన ‘మొండి’ సమస్య 

గత క్యూ2లో రూ.51,368 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.60,875 కోట్లకు పెరిగాయి. నికర మొండి బకాయిలు రూ.29,489 కోట్ల నుంచి రూ.27,295 కోట్లకు తగ్గాయి. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 24.98% నుంచి 31.78%కి, నికర మొండి బకాయిలు 16.06% నుంచి 17.30%కి పెరిగాయి. ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 30.78 శాతంగా, నికర మొండి బకాయిలు 18.76 శాతంగా ఉన్నాయి. గత క్యూ2లో రూ.3,261 కోట్లుగా ఉన్న మొత్తం కేటాయింపులు ఈ క్యూ2లో రూ.6,580 కోట్లకు చేరాయి. 

ఎల్‌ఐసీ నుంచి రూ.20,000 కోట్లు  
ఈ బ్యాంక్‌లో తన వాటాను బీమా దిగ్గజం ఎల్‌ఐసీ 51 శాతానికి పెంచుకోనున్నదని,  దీంతో తమకు ఎల్‌ఐసీ నుంచి రూ.20,000 కోట్లు నిధులు లభిస్తాయని శర్మ చెప్పారు. 

>
మరిన్ని వార్తలు