జూన్ త్రైమాసికంలో రూ. 182 కోట్లు
న్యూఢిల్లీ: ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ప్రైవేట్ రంగ ఐడీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం ఏకంగా 58% క్షీణించి రూ. 182 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో లాభం రూ. 438 కోట్లు. తాజా క్యూ1లో మొత్తం ఆదాయం రూ. 2,794 కోట్ల నుంచి రూ. 2,520 కోట్లకు క్షీణించింది. వడ్డీ ఆదాయం 8.2% పెరిగి రూ. 2,321 కోట్లుగా నమోదైంది.
సమీక్షాకాలంలో స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ).. 4.13% నుంచి 3.24%కి, నికర ఎన్పీఏలు 1.70% నుంచి 1.63%కి తగ్గాయి. విలువపరంగా చూస్తే స్థూల ఎన్పీఏలు రూ. 2,004 కోట్ల నుంచి రూ. 1,774 కోట్లకు, నికర ఎన్పీఏలు రూ. 881 కోట్ల నుంచి రూ. 804 కోట్లకు తగ్గాయి. సోమవారం బీఎస్ఈలో ఐడీఎఫ్సీ బ్యాంక్ షేరు ధర సుమారు 5 శాతం పెరిగి రూ. 41.25 వద్ద ముగిసింది.