ఐకియా స్టోర్‌ ఆరంభం

10 Aug, 2018 01:06 IST|Sakshi

తొలిరోజు పోటెత్తిన కొనుగోలుదార్లు, ఔత్సాహికులు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో ఐకియా గ్రూప్‌ తొలి స్టోర్‌ గురువారం ఆరంభమయింది. తొలిరోజు కొనుగోలుదారులు, ఔత్సాహికులు విపరీతంగా పోటెత్తారు. స్టోర్‌ను ఆరంభించిన సందర్భంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ... ఐకియా సంస్థ హైదరాబాద్‌కు రావటం తమ ప్రభుత్వ ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ విధానాల ఫలితమన్నారు. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలున్న ఐకియా.. అందుబాటు ధరల్లో హోమ్‌ ఫర్నిషింగ్‌ను అందిస్తుందన్నారు. ‘‘ఈ సంస్థ స్థానికంగా సమీకరిస్తున్న వస్తువుల్లో 30 శాతం తెలంగాణవే.

ఇక్కడి చేనేత ఉత్పత్తులు, నిర్మల్‌ పెయింటింగ్స్, గ్లాస్‌ వర్క్స్‌ను ఐకియాలో విక్రయానికి పెడతారు. దీంతో ప్రావీణ్యం గల కార్పెంటర్లకూ ఉపాధి కలుగుతోంది’’ అని వివరించారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి సంస్థలు మరెన్నో రానున్నాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని స్వీడన్‌ రాయబారి క్లాస్‌ మోలిన్తో పాటు తెలంగాణ ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ , ఐకియా గ్రూప్‌ సీఈఓ జాస్పర్‌ బ్రాడిన్, గ్రూప్‌ డిప్యూటీ సీఈఓ జువెన్సియో మాజు, ఐకియా ఇండియా సీఈఓ పీటర్‌ బెజెల్, తెలంగాణ ఎండీ జాస్‌ అచిలియా తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు