అమితాబ్ కాంత్
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలకు ఊతమివ్వడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందులో భాగంగా రోడ్ ట్యాక్స్ తగ్గింపు తదితర ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా దేశ జీడీపీ వృద్ధి, ఉపాధి కల్పనలో ఆటోమొబైల్ రంగం కీలకపాత్ర పోషించడం కొనసాగేలా తోడ్పాటు అందించనున్నట్లు చెప్పారు. దీర్ఘకాలంలో ఆటోమొబైల్స్, బ్యాటరీల తయారీ హబ్గా మారాలని పరిశ్రమల సమాఖ్య అసోచాం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కాంత్ పేర్కొన్నారు.
‘తక్కువ రోడ్ ట్యాక్సులు తదితర ప్రోత్సాహకాలతో ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే స్థూల దేశీయోత్పత్తిలోనూ, ఉపాధి కల్పనతో పాటు ఎగుమతుల్లోనూ ఆటోమొబైల్ రంగం కీలక పాత్రను పోషించడం కొనసాగించే విధంగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది‘ అని ఆయన చెప్పారు.