విమానానికి సెగ

7 Apr, 2020 01:55 IST|Sakshi

సెప్టెంబర్‌ వరకూ బలహీనంగానే డిమాండ్‌

కాపా ఇండియా నివేదిక

ముంబై: కరోనా వైరస్‌ కల్లోలానికి దేశీయ విమానయాన రంగం తీవ్రంగా ప్రభావితం కానున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ఎయిర్‌ ట్రాఫిక్‌ 8–9 కోట్ల ప్రయాణికులకే పరిమితం కానున్నదని విమానయాన కన్సల్టింగ్‌ సంస్థ, కాపా ఇండియా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20)లో 14 కోట్ల మంది విమానాల ద్వారా ప్రయాణించారని అంచనా. విమాన ప్రయాణికుల సంఖ్య భారీగానే తగ్గడమే కాకుండా భారత విమానయాన  సంస్థలకు రెండేళ్లలో అందాల్సిన 200కు పైగా విమానాలు మరో రెండేళ్ల జాప్యం తర్వాతే అందుతాయని పేర్కొంది. ఈ సంస్థ ఇంకా ఏం చెప్పిందంటే...  

► కరోనా వైరస్‌ కల్లోలంతో పర్యాటకంపై ఆంక్షలు, ఆర్థిక మందగమనం... ఈ రెండు అంశాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారత విమానయానంపై ప్రభావం తీవ్రంగా ఉండనున్నది.  
► సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం(జూలై–సెప్టెంబర్‌)లో  విమానయాన రంగంలో డిమాండ్‌ బలహీనంగా ఉంటుంది. ఈసారి ఇంకా బలహీనంగా ఉండొచ్చు.  
► ఏతావాతా ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో అవసరానికి మించి విమానాలు అందుబాటులో ఉంటాయి.  
► ఇక ఈ ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసిక కాలాల నుంచి సాధారణ స్థాయికి రావచ్చు.  
► ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కూడా భారీగానే తగ్గనున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 7 కోట్ల మంది విదేశాలకు విమానాల ద్వారా ప్రయాణించారని అంచనాలున్నాయి.  ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 3.5–4 కోట్లకే పరిమితం కానున్నది.

>
మరిన్ని వార్తలు