ఆ రంగాలు మరింత సంక్షోభంలోకి: రాజన్‌

7 Dec, 2019 16:45 IST|Sakshi

సాక్షి, ముంబై : ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ దేశ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కోనున్నాయని హెచ్చరించారు. ఇండియా టుడే పత్రికలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని తెలిపారు. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి చేరిన విషయాన్ని గుర్తు చేశారు. నిరుద్యోగిత రేటు తీవ్ర స్థాయిలో ఉందని తెలిపారు. 

రియల్టీ, కన్‌స్ట్రక్షన్‌, మాన్యుఫాక్చర్‌  కంపెనీలకు పెద్దమొత్తంలో రుణాలిచ్చే (నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌) ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల నాణ్యతను పరిశీలించాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర బ్యాంకు టాప్‌ 50 నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల పనితీరును సమీక్షిస్తుందన్న ఆయన ఆర్‌బీఐ వాటి పనితీరును, వాటి ఎసెట్‌ క్వాలిటీని కూడా సమీక్షించాలని సూచించారు.  కాగా షాడో బ్యాంకింగ్ రంగంలో మొత్తం ఆస్తులలో 75 శాతం వాటా ఉన్న టాప్ 50 నాన్-బ్యాంక్ ఫైనాన్షియర్లను సెంట్రల్ బ్యాంక్ నిశితంగా పరిశీలిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అలాగే అతి ముఖ్యమైన పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు కుప్పకూలకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందని ఆయన పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. 

కాగా నిర్మాణ రంగ ప్రాజెక్టులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని సుమారు యూఎస్‌డీ 66 బిలియన్ల మేర బకాయిలు ఉన్నటు ఇటీవల ఓ సర్వే తెలియజేసిందని పేర్కొన్నారు. మరోవైపు ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ స్పందిస్తూ సుమారు 4.54 లక్షల యూనిట్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి కావడం లేదని వెల్లడించారు.

మరిన్ని వార్తలు