కంపెనీలకు ఫండింగ్‌ రెడీనెస్‌ రిపోర్ట్‌

5 Apr, 2017 00:34 IST|Sakshi
కంపెనీలకు ఫండింగ్‌ రెడీనెస్‌ రిపోర్ట్‌

రూపొందిస్తున్న నేషియో కల్టస్‌ కన్సల్టెన్సీ
మే 12న ఇండియా ఫండ్‌ ఫెస్ట్‌


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందే. లేదంటే అంచనాలు తారుమారు అవుతాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజీ కన్సల్టింగ్‌ సేవల్లో ఉన్న నేషియో కల్టస్‌ కన్సల్టెన్సీ ‘ఫండింగ్‌ రెడీనెస్‌’ పేరుతో రిపోర్టులను రూపొందిస్తోంది. వ్యాపారానికి ఉన్న శక్తి, ఉత్పాదన, సేవల పరిపక్వత, మార్కెట్‌ అవకాశాలు, ఎంత పెట్టుబడి పెట్టొచ్చు, బలాలు, సవాళ్లు, వ్యవస్థాపకుల సామర్థ్యం వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ రిపోర్టును తయారు చేస్తోంది. ఇలా నివేదికను తయారు చేయడం ప్రపంచంలో తొలిసారి అని నేషియో కల్టస్‌ కన్సల్టెన్సీ పార్టనర్‌ నళిన్‌ సింగ్‌ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లతోపాటు నిధుల కోసం చూస్తున్న కంపెనీకి ఇది ప్రయోజనాన్ని చేకూరుస్తుందని చెప్పారు. బిజినెస్, ఇండస్ట్రీ, ఫైనాన్షియల్‌ నిపుణులు ఈ నివేదికను రూపొందిస్తారని వివరించారు.

50 కంపెనీలకు ఫండింగ్‌..
నేషియో కల్టస్‌ మే 12న బెంగళూరులో ఇండియా ఫండ్‌ ఫెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే 5 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఫండింగ్‌ రెడీనెస్‌ స్కోరు ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ అయిన 50 కంపెనీలకు ఫెస్ట్‌ రోజే నిధులు సమకూరుస్తారు. ఫెస్ట్‌కు భారత్‌తోపాటు వివిధ దేశాల నుంచి 200 మంది ఇన్వెస్టర్లు వస్తున్నారని కంపెనీ పార్టనర్‌ దినేశ్‌ సింగ్‌ తెలిపారు. విశేషమేమంటే లక్నో, పట్నా, ఇండోర్, చండీగఢ్, అహ్మదాబాద్, హైదరాబాద్‌ నుంచి దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. భారత్‌తోపాటు పలు దేశాల్లోని 225 నగరాలు, పట్టణాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వైజాగ్, విజయవాడ సంయుక్తంగా 25వ స్థానంలో, వరంగల్‌ 30వ స్థానంలో నిలిచాయి.

మరిన్ని వార్తలు