బ్యాంకర్ల సదస్సులో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి గల బ్యాంకులు కనీసం 3–4 అయినా భారత్కు అవసరమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. దేశీ బ్యాంకింగ్ రంగం రిస్కు సామర్ధ్యం చాలా తక్కువేని, ప్రాజెక్టుల మదింపు సామర్ధ్యం ఉండాల్సినంత స్థాయిలో లేదని కుమార్ పేర్కొన్నారు. గురువారం ప్రారంభమైన బ్యాంకింగ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.
ఈ నేపథ్యంలో పరిశ్రమలకు.. ముఖ్యంగా మధ్య, చిన్న తరహా సంస్థలకు మరిన్ని రుణాలివ్వడంలోనూ.. మరిన్ని రిస్కులు తీసుకోవడంలోనూ బ్యాంకింగ్ రంగానికి మరింత స్వేచ్ఛనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ‘అంతర్జాతీయ స్థాయి బ్యాంకులు 3–4 అయినా భారత్లో ఉండాలి. ప్రపంచ టాప్ 200 బ్యాంకుల్లో వాటి పేర్లుండాలి‘ అన్నారు. ఆర్బీఐ.. బ్యాంకులను అతిగా నియంత్రించడం తగ్గించుకోవాలని, రుణ వితరణ సామర్థ్యాన్ని పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.