అనుకూల దేశాల్లో భారత్: యూబీఎస్
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) అత్యంత అనుకూల దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తున్నట్లు స్విట్జర్లాండ్ ఆర్థిక సేవల సంస్థ, యూబీఎస్ తాజా నివేదికలో తెలియజేసింది. కొనసాగుతున్న వ్యవస్థాగత సంస్కరణల కారణంగా భారత్లో ఎఫ్డీఐలు పెరుగుతున్నాయని పేర్కొంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో అమెరికాలో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో దాదాపు నాలుగో వంతు కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. ఐదేళ్లలో 7,500 కోట్ల డాలర్ల మేర ఎఫ్డీఐలు భారత్లోకి వస్తాయంటున్న ఈ నివేదిక కొన్ని ముఖ్యాంశాలు...
► భారత్లో ఎఫ్డీఐలు గత దశాబ్దకాలంతో పోల్చితే 2016–17 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెట్టింపై 4,200 కోట్ల డాలర్లకు చేరాయి.
►గత ఏడాది డిసెంబర్ క్వార్టర్లో ఎఫ్డీఐలు మందగించినా, రానున్న క్వార్టర్లలో సాధారణ స్థాయికి వచ్చే అవకాశాలున్నాయి.
►ఎఫ్డీఐ ప్రవాహాలు నిలకడగా వచ్చేలా చూడ్డంపై భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి గాను తయారీ రంగం సత్తాను మరింతగా మెరుగుపరచాల్సి ఉంది. గ్లోబల్ వాల్యూ చెయిన్లో ఒక భాగంగా తయారీ రంగాన్ని తీర్చిదిద్దాల్సి ఉంది.