బీమా రంగంలోకి ఇండియాపోస్ట్‌..

21 Sep, 2018 00:37 IST|Sakshi

  ప్రత్యేక కంపెనీ ఏర్పాటుకు కసరత్తు  

 కన్సల్టెన్సీల నియామకానికి బిడ్‌లు

న్యూఢిల్లీ: ప్రత్యేకంగా బీమా సర్వీసుల వ్యాపార విభాగం ఏర్పాటుపై ఇండియా పోస్ట్‌ దృష్టి సారించింది. దీనికి సంబంధించి తగు సలహాలు ఇచ్చేందుకు కన్సల్టెంట్‌ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఎంపిౖMðన కన్సల్టెంటు.. వ్యూహాత్మక వ్యాపార విభాగంగా పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (పీఎల్‌ఐ) ఏర్పాటు, ప్రభావాలు, పోస్టల్‌ విభాగం పరిధిలోనే ప్రభుత్వ రంగ çస్వతంత్ర సంస్థగా మార్చడం తదితర అంశాలను అధ్యయనం చేసి, ప్రాజెక్టు రిపోర్ట్‌ తయారు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రీ–బిడ్‌ సమావేశం సెప్టెంబర్‌ 18న జరిగినట్లు వివరించాయి. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్, ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్, కేపీఎంజీ, డెలాయిట్‌ ఇండియా వంటి పేరొందిన కన్సల్టెన్సీ సంస్థలు దీనికి హాజరైనట్లు పేర్కొన్నాయి. రెండేళ్ల కాలంలో పోస్టల్‌ విభాగం ప్రత్యేక బీమా సంస్థ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా ఇటీవలే వెల్లడించారు.
 

ప్రస్తుతం పోస్టల్‌ విభాగం.. ప్రభుత్వ, సెమీ – గవర్నమెంట్‌ ఉద్యోగులకు పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (పీఎల్‌ఐ) కింద జీవిత బీమా పథకాలు అందిస్తోంది. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలు, మహిళలకు బీమా కవరేజీ అందించే ఉద్దేశంతో 1995 మార్చిలో రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఆర్‌పీఎల్‌ఐ) పథకాలను కూడా ప్రవేశపెట్టింది. 2017 మార్చి 31నాటికి మొత్తం 46.8 లక్షల పీఎల్‌ఐ, 1.46 కోట్ల ఆర్‌పీఎల్‌ఐ పాలసీలు ఉన్నాయి. పోస్టల్‌ విభాగం ఇటీవలే ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ను కూడా ప్రారంభించింది. బజాజ్‌ అలయంజ్‌ పాలసీలను విక్రయించేందుకు అయిదేళ్ల పాటు కార్పొరేట్‌ ఏజంటుగా వ్యవహరించే ఒప్పందాన్ని ఇటీవలే కుదుర్చుకుంది. 
 

మరిన్ని వార్తలు