స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో భారత్‌ది రెండో స్థానం 

9 Nov, 2018 01:53 IST|Sakshi

జూలై–సెప్టెంబర్‌పై క్యానలిస్‌ గణాంకాలు  

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో భారత్‌ వేగం పెంచింది. మూడవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌) స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో అమెరికాను మూడవ స్థానానికి నెట్టింది. చైనా తర్వాత 2వ స్థానానికి చేరింది. రీసెర్చ్‌ సంస్థ– క్యానలిస్‌ గణాంకాలను పరిశీలిస్తే– సమీక్షా కాలంలో చైనా స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 10.06 కోట్లు. భారత్‌ విషయంలో ఈ సంఖ్య 4.04 కోట్లుగా ఉంది. అమెరికా అమ్మకాలు నాలుగు కోట్లు. అయితే ఈ మూడు మార్కెట్ల అమ్మకాల్లో పెద్దగా వృద్ధి నమోదుకాకపోవడం గమనార్హం.  

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. క్షీణతే 
ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ గణాంకాలు పెరక్కపోగా క్షీణించాయి. 7.2 శాతం క్షీణతతో 34.89 కోట్లకు పడ్డాయి.  మొత్తం 10 ప్రధాన మార్కెట్లను చూస్తే... ఏడు మార్కెట్లలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది.  వీటిలో ఇండోనేషియా, రష్యా, జర్మనీలు మాత్రమే వృద్ధిని నమోదుచేసుకున్నాయి. చైనాలో అమ్మకాలు 15.2% పడిపోతే, భారత్‌లో 1.1%, అమెరికాలో 0.4% స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు తగ్గాయి. శామ్‌సంగ్‌ టాప్‌..: మార్కెట్‌ వాటాలో శాం సంగ్‌ 20.4%తో టాప్‌లో నిలిచింది. తర్వాత  హువావే(14.9%), యాపిల్‌ (13.4%), షావోమీ(9.6%), ఒపో(8.9%) ఉన్నాయి. 

>
మరిన్ని వార్తలు