చైనాను ఆర్థికంగా ఢీకొట్టే వ్యూహాలు..

21 Jun, 2020 18:46 IST|Sakshi

ముంబై: ప్రస్తుతం భారత్‌ చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 15న గల్వాన్‌ లోయలో  జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రజలు చైనాకు సంబంధించిన వస్తువులను వాడకూడదని డిమాండ్‌ ఎక్కువైంది. కాగా తయారీ రంగంలో ప్రపంచ వ్యాప్త ఎగుమతులలో కీలక పాత్ర పోషిస్తున్న చైనాను ఢీకొట్టడం అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి చైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందిస్తూ.. దిగుమతులు తగ్గించుకొని, తయారీ రంగంలో చైనా వస్తువులతో ఆధారపడకుండా, సొంతంగా ఎదగడానికి ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో చైనాపై ఆర్థిక ఆంక్షలను ప్రభుత్వం మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. మరో కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ స్పందిస్తూ.. చైనా వస్తువులను బాయ్‌కాట్‌ చేయాలని పిలుపునిచ్చారు. తాజా ఉద్రిక్త పరిస్థితులలో నూతన స్మార్ట్‌పోన్‌లను లాంచ్‌ చేసే ఈవెంట్లను‌ చైనీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థలు వాయిదా వేసుకున్నాయి. కాగా దేశ వృద్ధిలో చైనా ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2017 సంవత్సరంలో సిక్కింలో డొక్లాం ప్రాంతంపై సరిహద్దు వివాదాలున్న మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టింది. మరోవైపు చైనీస్‌ దిగ్గజాలు హువాయి టెక్నాలజీస్‌, షియోమీ బ్రాండ్స్‌ వైవిధ్యమైన స్మార్ట్‌ఫోన్స్‌తో అలరిస్తున్నాయి. అయితే దేశీయ మొబైల్‌ వినియోగంలో 75 శాతం చైనా నుంచి దిగుమతవుతున్నాయి. మరోవైపు దేశీయ ఫార్మా దిగుమతులలో 75శాతం ముడిపదార్థాలు చైనా నుంచి లభిస్తున్నాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం చైనాను ఢీకొట్టాలంటే ఒకేసారి వస్తువులను బ్యాన్‌ చేయాలనడం సరికాదని, అలా పిలుపునిస్తే అంతర్జాతీయంగా దేశానికి నష్టం కలిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశ్లేషకుల ప్రకారం.. దేశీయ తయారీ రంగానికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తు,  యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారిస్తే తయారీ రంగంలో వేరే దేశంపై భారత్‌కు ఆధారపడే అవకాశం తగ్గుతుంది. అలాగే యువతకు ఉపాధితో పాటు నిరుద్యోగం తగ్గి, దేశ వృద్ధి రేటు పెరుగుతుంది. కాగా దేశీయ సంస్థలు తక్కువ ధరకే క్వాలిటీ వస్తువులు అందించి, చైనాను భావోద్వేగంతో కాకుండా క్వాలిటీతో ఢీకొట్టాలి. దేశీయ మార్కెట్‌లో చైనా వస్తువులను ప్రజలు స్వచ్చందంగా బహిష్కరించే ప్రణాళికలు రచించడానికి సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: ఈ పాపులర్‌ యాప్స్‌ అన్నీ చైనావే)

మరిన్ని వార్తలు