ఇండియా బుల్స్‌కు బీజేపీ నేత షాక్‌, షేర్లు ఢమాల్‌

29 Jul, 2019 16:49 IST|Sakshi

సాక్షి, ముంబై: సోమవారం నాటి నష్టాల మార్కెట్లో ఇండియా బుల్స్‌ గ్రూపునకు భారీ షాక్‌ తగిలింది. పలు షెల్‌ కంపెనీలద్వారా ఇండియాబుల్స్‌ గ్రూప్‌ రూ. లక్ష కోట్లకు పైగా నిధులను అక్రమంగా దారి మళ్లించిందని బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు  సుబ్రమణియన్‌ స్వామి ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు దీనిపై సిట్‌ ద్వారా దర్యాప్తు చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆదివారం లేఖ రాసినట్టుగా వార్తలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన లేఖ సోషల్‌ మీడియాలో  హల్‌చల్‌  చేసింది. ఢిల్లీ,  చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో దాదాపు100 షెల్‌ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో  ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. దీంతో ఈ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. 

నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు(ఎన్‌హెచ్‌బీ) నుంచి షెల్‌ కంపెనీల ద్వారా నిధులను సమీకరించి ఇండియాబుల్స్‌ గ్రూప్‌ అక్రమంగా మళ్లించినట్లు సుబ్రమణ్యన్‌ స్వామి ఆరోపించారు. మనీలాండరింగ్‌ స్కామ్‌ కింద సీబీఐ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐవో, ఐటీ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేయవలసిందిగా ప్రధాని మోదీని కోరినట్టు సమాచారం. 

ట్రేడింగ్‌లో ఇండియాబుల్స్‌ గ్రూప్‌నకు చెందిన లిస్టెడ్‌ కంపెనీల కౌంటర్లలో అమ్మకాల వెల్లువ కురిసింది. ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 10 శాతానికిపైగా పడిపోయి టాప్‌లూజర్‌గా నమోదైంది. ఐబీ వెంచర్స్‌ 5 శాతం,  ఐబీ కన్జూమర్‌ ఫైనాన్స్‌ 3 శాతం ఇండియాబుల్స్‌ రియల్టీ 8.4 శాతం పతనమయ్యాయి.  ఐబీ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ షేరు 5శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 121.55 వద్ద ఫ్రీజ్‌  అయింది.

మరోవైపు బీజేపీ నేత ఆరోపణలను ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో తీవ్రంగా ఖండించింది. జూన్ 28నాటి సుబ్రమణియన్ స్వామి ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను హైలైట్ చేయాలనుకుంటున్నామంటూ వివరణ ఇచ్చింది. ఎన్‌హెచ్‌బి నుంచి ఇండియాబుల్స్ హౌసింగ్‌కు ఎలాంటి రుణాలులేవని కంపెనీ  సీఈవో గగన్‌ బాంగా స్పష్టం చేశారు. అసలు తమ చరిత్రలో ఎన్‌బీహెచ్‌ నుంచి లోన్స్‌ గానీ, రీఫైనాన్సింగ్ నిధులను గానీ తీసుకోలేదన్నారు. తమ మొత్తం లోన్‌బుక్‌ సుమారు రూ.87,000 కోట్లుగా ఉందని వివరించారు

మరిన్ని వార్తలు