2 ట్రేడింగ్‌ సెషన్‌ల్లోనే 50శాతం ర్యాలీ

22 Jun, 2020 16:12 IST|Sakshi

వాటా కొనుగోలు చేసిన మోర్గాన్‌ స్టాన్లీ

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(ఐబీహెచ్‌ఎఫ్‌) షేరు కేవలం 2ట్రేడింగ్‌ సెషన్‌ల్లోనే 50శాతం పెరిగింది. గడచిన రెండురోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీతో సహా అనేక సంస్థలు బల్క్‌డీల్స్‌ ద్వారా ఐబీహెచ్‌ఎఫ్‌ లో వాటాను కొనుగోలు చేసినట్లు ఎక్చ్సేంజ్‌ గణాంకాలు చెబుతున్నాయి.  

ఎన్‌ఎస్‌ఈలో గణాంకాల ప్రకారం సింగపూర్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ గతవారంలో చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో ఐబీహెచ్‌ఎఫ్‌కి చెందిన ప్రతి ఈక్విటీ షేరును రూ.184.76 చొప్పున మొత్తం 45.22లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఈ డీల్‌ మొత్తం విలువ సుమారు రూ.83.50కోట్లుగా ఉంది. ఈ ఒప్పందం తరువాత, ఇండియా బుల్స్ హౌసింగ్ షేరు శుక్రవారం 31 శాతం, సోమవారం 19శాతం చొప్పును మొత్తం 50శాతం లాభపడింది. 

కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశవ్యాప్తంగా వేతనాల కోత, ఉద్యోగాలు పోయే పరిస్థితితో నెలకొనడంతో ఈఎంఐలు డిఫాల్ట్‌ అవుతాయనే భయాలతో ఇన్వెసర్లు ఈ షేర్ల అమ్మకాలు మొగ్గుచూపారు. ఫలితంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు 23శాతం క్షీణించింది.

కరోనా మహమ్మారి ప్రభావం రుణగ్రహీత జీవనోపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, తద్వారా ఇది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల అసెట్‌ క్వాలిటీలను దెబ్బతీస్తుందని దేశీయ రేటింగ్‌ సంస్థ ఇక్రా అభిప్రాయపడింది.

సోమవారం మార్కెట్‌ ముగిసే సరికి ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 19శాతం లాభం‍తో రూ.242.20 వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తలు