క్యాష్‌ ఈజ్‌ కింగ్‌!

8 Nov, 2019 05:18 IST|Sakshi

పెద్ద నోట్ల రద్దుకు మూడేళ్లు.. (2016–19)

నగదు లావాదేవీలకే పెద్ద పీట

మళ్లీ కరెన్సీ నోట్లను భారీగా దాచుకుంటున్న జనం

మరోవంక డిజిటల్‌ లావాదేవీల్లోనూ భారీ వృద్ధి

ఆర్థిక వ్యవస్థకూ అప్పటి సైడ్‌ ఎఫెక్ట్స్‌

పెద్దనోట్లను రద్దు చేసి ఇవ్వాల్టికి మూడేళ్లు. అప్పట్లో పెద్దనోట్లంటే 1,000... 500 మాత్రమే. ఇప్పుడు 2000 లాంటి పేద్ద నోటు కూడా వచ్చేసింది లెండి!!. కాకపోతే మోదీ సర్కారు వాటిని రద్దు చేయటానికి చెప్పిన ప్రధాన కారణాలు రెండే!. ఒకటి నల్లధనాన్ని వెలికి తీయటం. రెండు డిజిటల్‌ లావాదేవీల్ని ప్రోత్సహించడం. మరి ఈ లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయి? ఆర్థిక వ్యవస్థపై, సామాన్యుల జీవితాలపై ఇది చూపిన  ప్రభావమెంత? నోట్ల రద్దు సైడ్‌ ఎఫెక్ట్స్‌ పూర్తిగా బయటపడినట్లేనా?

సాక్షి, బిజినెస్‌ విభాగం: 2016 నవంబర్‌ 8న.. రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన ప్రధాని మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1000... 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రొటీన్‌ ప్రసంగాన్ని అంతే రొటీన్‌గా చూస్తున్న జనానికది ఊహించని షాక్‌. జేబులోని డబ్బు మొదలెడితే... అవసరాల కోసం ఇంట్లో పెట్టుకున్న డబ్బంతా బ్యాంకుల్లోకి వచ్చింది. చేతిలో ఉన్న డబ్బును బ్యాంకు లో వేసేస్తే తర్వాతెప్పుడైనా తీసుకోవచ్చనే ఉద్దేశంతో జనాలు బారులు తీరారు. ఇక ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే డబ్బుపై పరిమితులు విధించడంతో.. ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఇలా... చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌లు అందిపుచ్చుకున్నాయి. ఇతర యాప్‌లూ వచ్చాయి. ప్రభు త్వం భీమ్‌ యాప్‌ను   తెచ్చింది. డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి. కానీ ఇప్పుడు..?!!

మళ్లీ క్యాష్‌ జమానా!
నేషనల్‌ అకౌంట్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌ఏఎస్‌)  గణాంకాల ప్రకారం... 2011–12 తర్వాత కరెన్సీ రూపంలో దాచుకునే నగదు పరిమాణం అత్యధిక స్థాయిలో ఉన్నది ఇప్పుడే!. ప్రజలు పొదుపు చేసే మొత్తంలో.. నగదు వాటా 2011–12లో 11.4 శాతం కాగా... 2017–18 నాటికి ఏకంగా 25.2 శాతానికి ఎగిసింది. అదే సమయంలో డిపాజిట్ల రూపంలో దాచుకునే మొత్తం 57.9 నుంచి 28 శాతానికి పడిపోయింది.  మరోవైపు, చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్ల విలువలో ప్రజలు కరెన్సీ రూపంలో తమ దగ్గర దాచుకున్న నోట్ల విలువ 2011–12 నుంచి 2015–16 మధ్య 9–12 శాతంగా ఉండేది. 2017–18 లో ఇది 26 %కి పెరిగిపోయింది. ప్రజలు డబ్బును బ్యాంకుల్లో ఉంచడం కన్నా తమ ఇంట్లో దాచుకోవటమే మంచిదన్నట్లు ఈ ధోరణి తెలియజేస్తోందని ఎన్‌ఏఎస్‌ వెల్లడించింది. మరి బ్లాక్‌మనీ సంగతి?

నలుపు... తెలుపైపోయిందా?
నల్లధనంపై పోరు పేరిట మోదీ సర్కార్‌ ప్రయోగించిన నోట్ల రద్దు అస్త్రం విఫలం కావటమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్‌బీఐ ముద్రించిన నగదులో నిర్దిష్ట మొత్తం.. లెక్కలు చెప్పని నల్ల ధనం రూపంలో (రూ.500, రూ.1,000 నోట్ల కింద) ఉల్లంఘనుల దగ్గర ఉందన్న అంచనాలతో ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించింది. లెక్కలు చెప్పాల్సి వస్తుంది కనక ఉల్లంఘనులు పెద్ద నోట్లను డిపాజిట్‌ చేయరని, నికరంగా వ్యవస్థలో వైట్‌ మనీ ఎంతుందో తేలుతుందని ప్రభుత్వం భావించింది. ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. ఆర్‌బీఐ 2018 నాటి నివేదిక ప్రకారం.. రద్దయిన నోట్లలో ఏకంగా 99.3% నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. వాటికన్నా అధిక విలువుండే రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టారు. వీటినీ దాచేయటం పెరిగి.. చలామణీ తగ్గిపోతుండటంతో ఈ నోట్ల ముద్రణను ఇటీవల నిలిపేసినట్లు సమాచారం. రేపో మాపో వీటినీ రద్దు చేయొచ్చనే వదంతులు షికార్లు చేస్తున్నాయి.

రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ రూ. 15.41 లక్షల కోట్లు
బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగొచ్చినది రూ. 15.30 లక్షల కోట్లు
వ్యవస్థలోకి తిరిగి రాని కరెన్సీ విలువ రూ. 10,720కోట్లు
తిరిగొస్తుందని ప్రభుత్వం అంచనా రూ. 10 లక్షల కోట్లు

డిజిటల్‌ లావాదేవీల్లోనూ వృద్ధి..
నోట్ల రద్దు తరవాత డిజిటల్‌ లావాదేవీలు పుంజుకున్నాయనేది నిజం. పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, యూపీఐ వంటివి బాగా వాడకంలోకి వచ్చాయి. మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కూడా పేమెంట్స్‌ సేవల్లోకి వస్తోంది. ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ గణాంకాల ప్రకారం 2016లో యూపీఐ ద్వారా 30 బ్యాంకుల నుంచి రూ.100 కోట్ల విలువైన 0.2 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. 2018లో 128 బ్యాంకుల నుంచి రూ.74,978 కోట్ల విలువైన 482 మిలియన్ల లావాదేవీలు జరిగాయి.  పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పీవోఎస్‌) మెషీన్లలో డెబిట్‌ కార్డుల స్వైపింగ్‌ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 0.8 బిలియన్ల  నుంచి 3.3 బిలియన్లకు... మొబైల్‌ వాలెట్ల లావాదేవీలు 0.32 బిలియన్ల నుంచి 3.4 బిలియన్లకు పెరిగాయి.

మందగమనానికి బీజం..
ఆర్థిక వ్యవస్థ నుంచి నల్లధనాన్ని తొలగించడంలో నోట్ల రద్దు ప్రయోగం విఫలమైందనే ఆరోపణలున్నాయి. ప్రజలు కరెన్సీ రూపంలో భారీగా నగదు దాచిపెట్టుకోవడానికి ఎప్పుడేం ముంచుకు వస్తుందోనన్న భయం కారణమైనప్పటికీ.. ప్రస్తుతం దేశీయంగా ఆర్థిక మందగమనానికి ఇది కూడా ఒక కారణమనే అభిప్రాయాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ముందుగా అంచనా వేసినట్లు 6.8 శాతం కాకుండా 6.1 శాతానికే పరిమితం కావొచ్చని ఆర్‌బీఐ ఇటీవలే పేర్కొంది. మూడీస్‌ వంటి అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు  5.8%కే పరిమితం కావొచ్చని చెబుతున్నాయి. మందగమనానికి నోట్ల రద్దుతో పాటు ఇతరత్రా అంశాలూ కారణంగా మారుతున్నాయి.  

► నోట్ల రద్దుతో వినియోగం గణనీయంగా దెబ్బతింది. ఉద్యోగాల కోత, ఆదాయాల తగ్గుదలకు, డిమాండ్‌ మరింత పడిపోవడానికి దారి తీసింది.

► 2017 జులైలో కొత్తగా అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ).. వ్యవస్థను మరింత కుంగదీసింది. ఎగుమతిదారులకు రీఫండ్‌లలో జాప్యాల వల్ల ఆ ఏడాది ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడింది.

► నోట్ల రద్దు, జీఎస్‌టీ ప్రభావాలు తగ్గుతున్నాయనుకుంటున్న తరుణంలో.. రుణాలభారంతో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కుదేలవటం గతేడాది నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగాన్ని అతలాకుతలం చేసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధాలతో పరిస్థితి మరింత దిగజారింది.

కష్టాలకు అదే మూలం..
డీమోనిటైజేషన్‌ వల్ల నగదు లభ్యత తగ్గిపోయి.. నగదు లావాదేవీలపైనే ఎక్కువగా ఆధారపడే అసంఘటిత రంగానికి పెద్ద దెబ్బ తగిలింది. అవినీతి అంతం లక్ష్యమని చెప్పినప్పటికీ మరింత పెద్ద నోట్లను ప్రవేశపెట్టడం వల్ల అక్రమ చెల్లింపులు మరింత సులభతరం చేసినట్లయింది.

– అభిజిత్‌ బెనర్జీ, ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత

మరిన్ని వార్తలు