ముంబై : ఎకానమీపై కరోనా వైరస్ చూపే ప్రభావాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ శుక్రవారం ఆర్థిక స్ధిరత్వానికి పలు చర్యలు ప్రకటించినా స్టాక్మార్కెట్లు ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి. మహమ్మారి బారినపడి ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న ఆందోళనతో కీలక సూచీలు నష్టాల బాట పట్టాయి. ఆరంభంలో 1000 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ఆర్బీఐ ఉపశమన చర్యలు ప్రకటించిన అనంతరం నెగెటివ్ జోన్లో కూరుకుపోయింది.
కరోనా వైరస్ పర్యవసానాలు ఎలా ఉంటాయనే దానిపై వృద్ధి రేటు అంచనాలు ఆధారపడి ఉంటాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. ఆర్థిక వ్యవస్ధ స్ధిరత్వానికి రూ 3 లక్షల కోట్ల నగదును మార్కెట్లోకి చొప్పించినట్టు ఆయన చేసిన ప్రకటనా మదుపుదారులను మెప్పించలేదు. ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో కీలక సూచీలు కుదేలయ్యాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 131 పాయింట్ల నష్టంతో 29,.815 పాయింట్ల వద్ద ముగియగా, 18 పాయింట్లు లాభపడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,660 పాయింట్ల వద్ద క్లోజయింది.