కేంద్రానికి అదనంగా రూ.5 లక్షల కోట్లు కావాలి

8 Apr, 2020 11:37 IST|Sakshi

కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక రంగానికి చేయూత

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రజలు, వ్యాపార సంస్థలకు సాయం అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 2–2.5 శాతం లేదా రూ.4–5 లక్షల కోట్ల మేర అదనంగా రుణాలు సమీకరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్‌ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని మార్కెట్‌ నుంచి కాకుండా ఆర్‌బీఐ నుంచి నేరుగా రుణాల రూపంలో తీసుకోవాలని, ఇందుకోసం ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం)ను సవరించాలని గార్గ్‌ సూచించారు. స్వయం ఉపాధి ఆధారిత వ్యాపారాలు, చిన్న వ్యాపారస్థులకు రూ.2 లక్షల కోట్ల మేర సాయం అందించాలని అభిప్రాయపడ్డారు.

వృద్ధి 2 శాతమే: ఇక్రా
కరోనా ప్రభావంలో 2020–21లో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 2 శాతమే ఉంటుందని ఇక్రా రేటింగ్స్‌ అంచనావేసింది. ‘‘2019–20 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) భారత్‌ జీడీపీలో వృద్ధిలేకపోగా 4.5 శాతం క్షీణత నమోదయ్యే వీలుంది. అయితే క్రమంగా కోలుకుని 2020–21లో 2 శాతం వృద్ధిని నమోదుచేసుకోవచ్చు’’ అని పేర్కొంది.

మరిన్ని వార్తలు