జూలై సీరీస్‌ లాభంతో షురూ..!

26 Jun, 2020 09:26 IST|Sakshi

2రోజుల నష్టాలకు చెక్‌ 

35వేలపైన సెన్సెక్స్‌ ప్రారంభం

10383 వద్ద మొదలైన నిఫ్టీ

దేశీయ ఈక్విటీ సూచీలు జూలై డెరివేటివ్‌ సిరీస్‌ను లాభంతో ప్రారంభించాయి. ఫలితంగా స్టాక్‌ మార్కెట్‌ 2రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ శుక్రవారం లాభంతో మొదలైంది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 340 పాయింట్ల లాభంతో 35182 వద్ద, నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 10383 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. నేడు జులై డెరివేటివ్‌ సిరీస్‌ ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపారు. దీంతో అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల బాట పట్టాయి. అత్యధికంగా ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతానికి పైగా లాభంతో 21,746.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు సైతం మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. నిన్న అమెరికా మార్కెట్లు లాభంతో ముగియగా, నేడు మన మార్కెట్‌ ప్రారంభ సమయానికి ఒక్క హాంకాంగ్ సూచీ తప్ప మిగిలిన అన్ని దేశాలకు చెందిన ఇండెక్స్‌లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు ఐటీసీ, కోల్‌ ఇండియా, గ్లెన్‌మార్క్‌ ఫార్మాతో పాటు సుమారు 247 కంపెనీలు నేడు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తత వహించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలను భావిస్తున్నారు.

టాటామోటర్స్‌, హిందాల్కో, జీలిమిటెడ్‌, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, హిందూస్థాన్‌ యూనిలివర్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 0.10శాతం నుంచి 1శాతం నష్టపోయాయి
 

మరిన్ని వార్తలు