టెకీలకు గుడ్‌న్యూస్‌ : ఐటీలో నియామకాల వెల్లువ

29 Oct, 2018 14:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాబోయే ఆరు నెలల్లో ఐటీ రంగంలో సంస్థలు పెద్దఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి.పలు ఐటీ కంపెనీలు ప్రధానంగా జూనియర్‌ లెవెల్‌ ఉద్యోగాలను భారీగా రిక్రూట్‌ చేస్తాయని ఎక్స్పెరిస్‌ ఐటీ ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే వెల్లడించింది. అమెరికాలో ప్రతిపాదిత వీసా నియంత్రణల నేపథ్యంలో భారత్‌లో గత కొద్దినెలలుగా తగ్గుముఖం పట్టిన నియామకాలు క్రమంగా ఊపందుకుంటున్నాయని ఈ నివేదిక పేర్కొంది. రానున్న రెండు త్రైమాసికాల్లో ఐటీ రంగంలో నియామకాలు చేపట్టేందుకు పలు సంస్థలు సుముఖంగా ఉన్నట్టు నివేదిక తెలిపింది.
 

భారీ ఐటీ దిగ్గజాలు హైరింగ్‌ ప్రణాళికలకు పదునుపెడుతుండగా, నాన్‌ ఐటీ కంపెనీలు సైతం డిజిటల్‌ వైపు మళ్లేందుకు అనుగుణంగా సాంకేతిక నిపుణుల నియామకంపై దృష్టిసారించాయి. ఐటీ కంపెనీలు భారీ వడపోతల అనంతరం జూనియర్‌ లెవెల్‌లో నియామకాలను పెద్దఎత్తున చేపడతాయని, సృజనాత్మకత, వినూత్న ఆలోచనాధోరణి కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్యాకేజీలు లభిస్తాయని నివేదిక పేర్కొంది.
 

మరోవైపు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బ్లాక్‌చైన్‌, రోబోటిక్స్‌ వంటి నూతన టెక్నాలజీలపై స్టార్టప్‌లు పనిచేస్తుండటంతో స్టార్టప్‌లలోనూ నియామకాలు భారీగా ఉంటాయని నివేదిక అంచనా వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 550 ఐటీ కంపెనీల యాజమాన్యాలతో ఇంటర్వ్యూల ద్వారా వారి హైరింగ్‌ ప్రణాళికలను ఎక్స్పెరిస్‌ ఐటీ ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే విశ్లేషించింది.

మరిన్ని వార్తలు