ఎగుమతులు రివర్స్‌గేర్‌

14 Sep, 2019 05:12 IST|Sakshi

ఆగస్టులో 6 శాతం క్షీణత దిగుమతులూ 13.45 శాతం పతనం

వాణిజ్యలోటు 13.45 బిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ: భారత్‌ ఆరి్థక వ్యవస్థ మందగమనానికి ఆగస్టు ఎగుమతి–దిగుమతులు అద్దం పడుతున్నాయి. ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక దిగుమతులదీ అదే ధోరణి. 13.45 శాతం క్షీణత నమోదయ్యింది. ఈ ఏడాది జూలైలో ఎగుమతులు స్వల్పంగా 2.25 శాతం వృద్ధి చెందాయి. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాశాలను చూస్తే...

► ఆగస్టులో ఎగుమతుల విలువ 26.13 బిలియన్‌ డాలర్లు. 2018 ఆగస్టుతో పోలి్చతే విలువ పెరక్కపోగా 6 శాతం క్షీణించింది. పెట్రోలియం, ఇంజనీరింగ్, తోలు, రత్నాలు, ఆభరణాల విభాగంలో అసలు వృద్ధిలేదు. ఎగుమతులకు సంబంధించి మొత్తం 30 కీలక రంగాలను చూస్తే, 22 ప్రతికూలతనే నమోదుచేసుకున్నాయి. రత్నాలు ఆభరణాల విభాగంలో –3.5% క్షీణత, ఇంజనీరింగ్‌ గూడ్స్‌ విషయంలో 9.35% క్షీణత, పెట్రోలియం ప్రొడక్టుల విషయంలో 10.73% క్షీణత నమోదయ్యింది. కాగా సానుకూలత నమోదు చేసిన రంగాల్లో ముడి ఇనుము, ఎలక్ట్రానిక్‌ గూడ్స్, సుగంధ ద్రవ్యాలు, మెరైన్‌ ప్రొడక్టులు ఉన్నాయి.  

► దిగుమతుల విలువలో కూడా (2018 ఆగస్టుతో పోలి్చతే) అసలు పెరుగుదల లేకపోగా 13.45 శాతం క్షీణత నమోదయ్యింది. విలువ 39.58 బిలియన్లుగా నమోదయ్యింది. దిగుమతుల్లో ఇంత స్థాయి క్షీణత 2016 ఆగస్టు తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో ఈ క్షీణ రేటు మైసస్‌ 14 శాతంగా ఉంది.  

► దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 13.45 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2018 ఆగస్టులో వాణిజ్యలోటు 17.92 బిలియన్‌ డాలర్లు.  

► ఆగస్టులో చమురు దిగుమతులు 8.9 శాతం పడిపోయి 10.88 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు యేతర దిగుమతులు కూడా 15 శాతం క్షీణించి, 28.71 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
► ఇక ప్రత్యేకించి పసిడి దిగుమతులు చూస్తే, భారీగా 62.49 శాతం పడిపోయి 1.36 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.  

ఏడాదంతా నిరుత్సాహమే...
భారత్‌ ఎగుమతుల విభాగం ఈ ఏడాది ఇప్పటి వరకూ నిరుత్సాహంగానే నిలిచింది. ఆరి్థక వ్యవస్థ మందగమనం ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఆరి్థక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. తయారీ రంగం మందగమనంతో జూలైలో తయారీ రంగం వృద్ధి కూడా 4.3 శాతానికి పరిమితం అయ్యింది. కాగా ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ చూసుకుంటే, భారత్‌ ఎగుమతులు 1.53 శాతం క్షీణించి, 133.54 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు కూడా 5.68 శాతం పడిపోయి 206.39 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 72.85 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  

>
మరిన్ని వార్తలు