పెద్ద ఫార్మా కంపెనీలకు రెండంకెల్లో ఆదాయ వృద్ధి: క్రిసిల్‌

29 Oct, 2018 01:58 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికాలో విక్రయాలు మెరుగుపడడం, రూపాయి బలహీతన, దేశీయంగా డిమాండ్‌ పుంజుకోవడం వంటి అంశాలతో పెద్ద ఫార్మా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండంకెల్లో ఆర్జించే అవకాశాలు ఉన్నాయని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ తెలిపింది. రూ.1,000 కోట్లకు పైగా టర్నోవర్‌ కలిగిన దేశీయ ఫార్మా కంపెనీలకు రెండంకెల్లో ఆర్జన మేలు చేస్తుందని పేర్కొంది. అమెరికా, దేశీయ మార్కెట్లు వీటికి 30 శాతం, 35 శాతం మేర ఆదాయలు తెచ్చిపెట్టేవిగా తెలిపింది.

20 లిస్టెడ్‌ కంపెనీల మొదటి త్రైమాసికాల్లో ఇందుకు సంబంధించి సంకేతాలు కూడా కనిపించాయని పేర్కొంది. ‘‘మొదటి త్రైమాసికంలో అమెరికా మార్కెట్‌ నుంచి వచ్చే ఆదాయాల్లో 7 శాతం వృద్ధి నెలకొంది. దేశీయ మార్కెట్‌ నుంచి ఆదాయాల్లో 25 శాతం వృద్ధి ఉంది. పెద్ద ఫార్మా కంపెనీల ఆదాయాలు 12–13 శాతం పెరిగేందుకు అవకాశం ఉంది’’ అని క్రిసిల్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు