రైల్వే బంపర్‌ ఆఫర్‌ : ఆధార్‌ లింక్‌ చేస్తే...

7 Apr, 2018 14:06 IST|Sakshi

దేశీయ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో ఆధార్‌ కార్డు నెంబర్‌ను యూజర్లు లింక్‌ చేస్తే, 10వేల రూపాయల వరకు నగదు బహుమతి అందించనున్నట్టు ఐఆర్‌సీటీసీ తెలిపింది. దేశీయ రైల్వే జారీ చేసిన సర్క్యూలర్‌లో ఇది పేర్కొంది. 2018 జూన్‌ వరకు ఈ స్కీమ్‌ అందుబాటులో ఉండనుంది. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో ఆధార్‌ లింక్‌ చేసి, ట్రైన్‌లో ప్రయాణించిన యూజర్లు ఈ ‘లక్కీ డ్రా స్కీమ్‌’ కి అర్హులవుతారు.  

ప్రతి కేలండర్‌ నెలా లక్కీ డ్రా స్కీమ్‌ ఉంటుంది. ముందు నెలలో ప్రయాణించిన ఐదు లక్కీ ప్రయాణికులను, తర్వాతి నెల రెండో వారంలో కంప్యూటరైజ్డ్‌ ర్యాండమ్‌ లక్కీ డ్రా ప్రాసెస్‌ ద్వారా ఎంపికచేసి వారికి ఈ నగదు బహుమతి అందిస్తారు. ఈ నగదు బహుమతితో పాటు, రైల్‌ టిక్కెట్‌ నగదంతా రీఫండ్‌ చేస్తారు. పీఎన్‌ఆర్‌(ప్యాసెంజర్‌ నేమ్‌ రికార్డు)ల్లో ఆధార్‌ ఆధారితంగా బుక్‌ చేసుకున్న యూజర్లకు మాత్రమే ఈ లక్కీ డ్రా స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. ఒకే యూజర్‌ ఒకటి కంటే ఎక్కువ పీఎన్‌ఆర్‌లు కలిగి ఉంటే, కేవలం ఒకే ఒక్క పీఎన్‌ఆర్‌ను ఎంపిక చేస్తారు. నగదు బహుమతి గెలుచుకున్న విన్నర్ల పేర్లను ఐఆర్‌సీటీసీ తన వెబ్‌సైట్‌లో తదుపరి నెలలో పేర్కొంటోంది. ఐఆర్‌సీటీసీ ఉద్యోగులు ఈ లక్కీ డ్రా స్కీమ్‌కు అర్హులు కారు. 
 

మరిన్ని వార్తలు